Begin typing your search above and press return to search.

జగన్ కు నో ఛాన్స్.. లోకేశ్ సంచలన నిర్ణయం

ఇటీవల రాష్ట్ర స్థాయి దివ్యాంగుల అసోసియేషన్ ప్రతినిధులు కొందరు మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు.

By:  Tupaki Political Desk   |   22 May 2026 9:00 PM IST
జగన్ కు నో ఛాన్స్.. లోకేశ్ సంచలన నిర్ణయం
X

ఏపీ రాజకీయాల్లో మాజీ సీఎం జగన్ ప్రభావం తగ్గించేందుకు మంత్రి లోకేశ్ పక్కాగా వ్యూహం రచిస్తున్నారా? మాజీ సీఎం జగన్ కు రాజకీయంగా ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతోనే మంత్రి పావులు కదుపుతున్నారా? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న ఓ ఉదంతంపై విద్యాశాఖలో జరుగుతున్న చర్చను పరిశీలిస్తే, పాలన వ్యవహారాల్లో మంత్రి లోకేశ్ అత్యంత అప్రమత్తంగా ఉంటున్నారని అంటున్నారు. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతోనే యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

అసలేం జరిగింది?

ఇటీవల రాష్ట్ర స్థాయి దివ్యాంగుల అసోసియేషన్ ప్రతినిధులు కొందరు మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం యూనివర్సిటీల్లో ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ లో తమ రిజర్వేషన్లు ఇవ్వకపోవడంపై ఫిర్యాదు చేశారు. దీనిపై జగన్ స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాను న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అయితే ఈ విషయంపై మంత్రి లోకేశ్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారని అంటున్నారు. సాధారణంగా ఇలాంటి ఫిర్యాదులు వస్తే ఎవరైనా రాజకీయంగా ఎదురుదాడి చేస్తుంటారని అంటున్నారు. కానీ, లోకేష్ భిన్నంగా స్పందించారని చెబుతున్నారు. రాజకీయ విమర్శల కంటే ముందు, అసలు ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారని, తప్పు జరగడానికి కారణాలు ఏంటి? దానిని ఎలా సరిదిద్దాలనే అంశంపైనే ఎక్కువగా ఫోకస్ చేశారని అంటున్నారు.

అధికారులపై సీరియస్

ఈ సమస్యపై విద్యాశాఖ అధికారులతో అత్యవసరంగా సమీక్షించిన లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇంత పారదర్శకంగా, నిబద్ధతతో పనిచేస్తున్నప్పుడు.. దివ్యాంగులు జగన్ దగ్గరకు వెళ్లి బాధపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడ పొరపాటు జరిగింది? ఎవరు తప్పు చేశారు? అని అధికారులను గట్టిగా నిలదీశారని చెబుతున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వడం పక్కన పెడితే ప్రజలకు న్యాయం సకాలంలో అందకపోవడానికి బాధ్యులెవరని ప్రశ్నించడమే విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు. వెంటనే ఆ లోపాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే నివేదిక సమర్పించాలని, దివ్యాంగులకు ఎలాంటి అన్యాయం జరగకుండా సమస్యను ఇప్పుడే పరిష్కరించాలని ఆదేశించారని చెబుతున్నారు.

ప్రతిపక్షానికి నో ఛాన్స్

ఈ పరిణామంపై రాజకీయ పరిశీలకులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. సహజంగా రాజకీయాల్లో ప్రత్యర్థుల లోపాలను ఎత్తిచూపడం ద్వారా మైలేజ్ తెచ్చుకోవాలని నేతలు భావిస్తారు. జగన్ కూడా అదే పంథాలో వెళ్లాలని చూశారని అంటున్నారు. కానీ లోకేష్ ఆ తప్పులను గుర్తించి, క్షణాల్లో సరిదిద్దే సరికొత్త అడ్మినిస్ట్రేషన్ స్టైల్‌ను ఆవిష్కరించారని అంటున్నారు. గతంలో పాఠ్యపుస్తకాల ముద్రణలో లింగ సమానత్వం లోపించిన చిత్రాలను చూసి తక్షణమే మార్పులు చేయించిన లోకేష్.. ఇప్పుడు దివ్యాంగుల విషయంలోనూ అంతే వేగంగా స్పందించారని గుర్తు చేస్తున్నారు. వ్యవస్థలో చిన్న లోపం ఉన్నా తానే స్వయంగా దిద్దుబాటు చర్యలు చేపడుతుండటంతో.. కూటమి ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్న వైసిపికి మాట్లాడే అవకాశం చేయలనే ఆలోచనతో లోకేశ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.