డిజిటల్ విధానంలో ఏపీలో తొలిసారి జనగణన
జన గణన అన్నది ఏపీలో నిర్వహించేందుకు ముహూర్తం కుదిరింది. రెండు దశలుగా ఈ జన గణనను చేపట్టనున్నారు.
By: Satya P | 11 March 2026 5:00 AM ISTజన గణన అన్నది ఏపీలో నిర్వహించేందుకు ముహూర్తం కుదిరింది. రెండు దశలుగా ఈ జన గణనను చేపట్టనున్నారు. ఈ మేరకు వివరాలను రాష్ట్ర జన గణన విభాగం రిలీజ్ చేసింది. 2027 జనగణనలో భాగంగా రాష్ట్రంలో ఈ ఏడాది మే 1 తేదీ నుంచి హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ ప్రక్రియ చేపడుతున్నట్టు ఏపీ సెన్సెస్ ఆపరేషన్స్, సిటిజన్ రిజిస్ట్రేషన్స్ విభాగం వెల్లడించింది.
మొదటి దశలో అలా :
ఇక ఏపీలో జనాభా లెక్కల ప్రక్రియను రెండు దశలుగా చేపడుతున్నారు. మొదటి దశలో భాగంగా ఇళ్ల జాబితా, గృహ గణన ప్రక్రియను చేపడతారు. ఈ ప్రక్రియ అంతా మే 30 తేదీ వరకూ సాగుతుంది. ఈ సందర్భంగా ఇళ్లలోని పరిస్థితులు, ఆ ఇంటిలోని వివిధ సదుపాయాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను అధికారులు నమోదు చేస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 16 తేదీ నుంచి 30 తేదీ వరకూ స్వీయ గణన వెసులుబాటు కూడా కల్పించారు. ఇక రెండో దశలో భాగంగా 2027 ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.
సమగ్ర సమాచారం నిక్షిప్తం :
ఇక ఈ జనగణనలో భాగంగా సామాజిక ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు, వలసలు, సంతానానికి సంబంధించిన సమగ్రమైన వివరాలను ప్రతీ కుటుంబానికి సంబంధించి నమోదు చేస్తారు. ఇదంతా పూర్తిగా డిజిటల్ విధానంలో తొలిసారి చేపట్టనున్నారు. ఇక మొబైల్ అప్లికేషన్లు, ప్రత్యేకించిన వెబ్ పోర్టళ్ల ద్వారా ఈ సమాచార సేకరణ జరుగుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేని ప్రాంతాల్లో ఆఫ్ లైన్ లోనూ సమాచార సేకరణ, జనగణన చేపట్టనున్నరు. డిజిటల్ విధానంలో ప్రజలే నేరుగా తమ వివరాలను స్వీయ గణన ద్వారా నమోదు చేసేందుకు అవకాశం ఇస్తున్నారు. ఈ విధంగా పబ్లిక్ పోర్టల్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా చేయడం ఇదే తొలిసారి.
హౌస్ లిస్టింగ్ మొబైల్ యాప్ :
ఇక జనాభా గణన కోసం సెన్సెస్ మేనేజ్మెంట్ మోనిటరింగ్ సిస్టమ్ పోర్టల్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది. హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ కోసం డిజిటల్ సరిహద్దు మ్యాపింగ్ చేయనున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఈ జనాభా గణన వివరాల నమోదు కోసం 16 భాషలలో హౌస్ లిస్టింగ్ మొబైల్ యాప్ అందుబాటులోకి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని చెబుతున్నారు. ఇక 2027 జనగణన ప్రక్రియపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ప్రగతి, వికాస్ అనే మస్కట్ లను వినియోగిస్తున్నట్టు ఏపీ సెన్సెస్ ఆపరేషన్స్, సిటిజన్ రిజిస్ట్రేషన్స్ విభాగం తెలిపింది. మొత్తానికి ఏపీలో జనాభా గణన కోసం తొలి అడుగు పడింది. ముహూర్తం కూడా నిర్ణయించారు. దాంతో ఈ ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగే అవకాశం ఉంటుంది.
