అసెంబ్లీలోకి కూడా రానివ్వం: షా మాటలు వైరల్
ఇక, ఇదే సమయంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పు డు వైరల్ అవుతున్నాయి.
By: Garuda Media | 5 May 2026 12:48 PM ISTపశ్చిమ బెంగాల్ పై తమదైన ముద్ర వేయాలని గత దశాబ్ద కాలంగా ఉవ్విళ్లూరిన కమల నాథులు అన్నంత పనీ చేశారు. తాజా ఫలితాల్లో బీజేపీ 206 అసెంబ్లీ స్థానాల్లో విజయం దక్కించుకుని కనీ వినీ ఎరుగని రికార్డులు సొంతం చేసుకుంది. ఇక, నాలుగోసారి అధికారంలోకి వస్తామని ప్రకటించుకున్న మమతా బెనర్జీ.. కేవలం 80 స్థానాలకు పరిమితం అయ్యారు. అయితే.. గెలుపు ఓటములు ఎలా ఉన్నా.. ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
"బీజేపీ మనం తినే ఆహారాన్ని కూడా నియంత్రిస్తుంది. చేపలు ఇక రాష్ట్రంలో అమ్మేందుకు.. నిషేధం విధిస్తారు" అంటూ.. ఎన్నికల ప్రచారంలో మమత ప్రచారం చేశారు. కానీ, చిత్రంగా ఎన్నికల ప్రచారంలో బీజేపీ కార్యకర్తలు, అభ్యర్థులు.. బుట్టల కొద్దీ చేపలను ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో మమత చేసిన ప్రచారాన్ని ఎవరూ విశ్వసించలేదు. ఆ వ్యాఖ్యలను ఇప్పుడు బీజేపీ మరోసారి ప్రచారంలోకి తీసుకువచ్చి .. ప్రజలను ఎలా రెచ్చగొట్టినా.. మాకే అండగా ఉన్నారంటూ ప్రకటనలు గుప్పించింది.
ఇక, ఇదే సమయంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పు డు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆయన భవానీ పూర్(సీఎం మమత పోటీ చేసిన స్థానం) లో పర్యటించారు. ఈ సమయంలో రెండు కీలక ప్రకటనలు చేశారు. " మీరంతా మమ్మల్ని ఆశీర్వదిస్తే.. ఆమె ఇక, అసెంబ్లీకి కూడా రాదు" అని అన్నారు. అంతేకాదు.. "మీరు మాతో ఉంటే.. ఆమెను అసెంబ్లీకి కూడా రాకుండా చేస్తాం" అన్నారు.
రెండు వ్యాఖ్యల అంతరార్థం ఒక్కటే అయినా.. విభిన్న సామాజిక వర్గాలను ఉద్దేశించి షా చేసిన వ్యాఖ్యలు ఫలించాయన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం భవానీపూర్ నియోజకవర్గంలో 15200 ఓట్ల తేడాతో మమత పరాజయం పాలయ్యారు. ఇప్పుడు నిజంగానే ఆమె సభలోకి అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. పోనీ.. ఉప ఎన్నిక ద్వారా అయినా గెలుద్దామంటే.. తన పార్టీ వారితోనే రాజీనామా చేయించాలి. పోనీ.. అలా చేసినా.. బీజేపీ ఊరుకుంటుందా? పైగా అధికారంలోకి వచ్చేసిన పార్టీ. దీంతో ఇప్పుడు నిజంగానే షా మాటలు నిజమయ్యాయంటూ.. సోషల్ మీడియాలో ప్రజలు నాటి వ్యాఖ్యలను ప్రచారం చేస్తున్నారు.
