Begin typing your search above and press return to search.

భారత్ పై 100 శాతం ప్రతీకార సుంకాలు.. అమెరికా రె'ఢీ'

అమెరికాపై అత్యధికంగా సుంకాలు విధిస్తున్న దేశాల జాబితాను మీడియాకు చూపిస్తూ కరోలిన్‌ మాట్లాడారు.

By:  Tupaki Desk   |   1 April 2025 3:03 PM IST
భారత్ పై 100 శాతం ప్రతీకార సుంకాలు.. అమెరికా రెఢీ
X

భారత్‌తో సహా పలు కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏప్రిల్‌ 2న తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని ఆయన ఇదివరకే స్పష్టం చేశారు. తాజాగా ఈ విషయంపై వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ మాట్లాడారు. అమెరికా ఉత్పత్తులపై భారత్‌ ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర దేశాలు విధిస్తున్న అధిక సుంకల కారణంగా అమెరికా తన ఉత్పత్తులను ఎగుమతి చేయలేకపోతోందని, అందుకే ఈ చర్యకు ఇదే సరైన సమయమని ఆమె పేర్కొన్నారు.

అమెరికాపై అత్యధికంగా సుంకాలు విధిస్తున్న దేశాల జాబితాను మీడియాకు చూపిస్తూ కరోలిన్‌ మాట్లాడారు. "కొన్ని దేశాలు చాలా కాలంగా టారిఫ్‌ల రూపంలో మమ్మల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఇవన్నీ అన్యాయమైన వాణిజ్య విధానాలు. ఐరోపా సమాఖ్య మా డెయిరీ ఉత్పత్తులపై 50 శాతం, జపాన్‌ మా బియ్యంపై 700 శాతం, భారత్ మా వ్యవసాయ ఉత్పత్తులపై 100 శాతం, కెనడా మా బటర్‌, చీజ్‌పై 300 శాతం టారిఫ్‌ విధిస్తున్నాయి. దీనివల్ల మా ఉత్పత్తులను ఆయా దేశాల మార్కెట్లకు పంపడం అసాధ్యంగా మారుతోంది. అమెరికన్ల వ్యాపారాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. అందుకే ఈ దేశాలపై ప్రతీకార సుంకాలు విధించడానికి ఇదే సరైన సమయం అని మేము భావిస్తున్నాము" అని ఆమె వివరించారు.

అమెరికా అధ్యక్షుడు వాణిజ్య సంబంధాల విషయంలో ఒక చారిత్రాత్మకమైన మార్పు తీసుకురాబోతున్నారని కరోలిన్‌ తెలిపారు. అమెరికా ప్రజల సంక్షేమం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని, ఈ నిర్ణయాలు బుధవారం (ఏప్రిల్‌ 2) నుంచి అమల్లోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. అంతకుముందు అధ్యక్షుడు ట్రంప్‌ కూడా ఈ విషయంపై స్పందించారు. "పరస్పర ప్రతీకార సుంకల విషయంలో మేము ఒక శాశ్వతమైన నిర్ణయం తీసుకోబోతున్నాము. ఇది మా దేశానికి ఒక భారీ గేమ్ ఛేంజర్ అవుతుంది" అని ఆయన అన్నారు.

అంతేకాకుండా తమ ప్రతీకార సుంకాలు ప్రపంచంలోని అన్ని దేశాలపైనా ఉంటాయని ట్రంప్‌ తేల్చిచెప్పారు. "చాలా సంవత్సరాలుగా మేము ప్రపంచ దేశాలతో ఉదారంగా వ్యవహరించాము. కానీ చరిత్రలో ఏ దేశాన్నీ దోచుకోనంతగా అవి అమెరికాను దోచుకున్నాయి. వాణిజ్య విధానాల విషయంలో కొన్నిసార్లు అమెరికా యొక్క మిత్ర దేశాలు కూడా శత్రువుల కంటే దారుణంగా ప్రవర్తించాయి. దశాబ్దాలుగా వారు మనపై విధించిన, వివిధ పేర్లతో దోచుకున్న దానికంటే ప్రస్తుతం అగ్రరాజ్యం ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాలు చాలా తక్కువ" అని అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

మొత్తానికి అమెరికా తన వాణిజ్య భాగస్వాములపై, ముఖ్యంగా భారత్‌ వంటి దేశాలపై ప్రతీకార చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్ 2న వెలువడే తుది నిర్ణయం ప్రపంచ వాణిజ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.