Begin typing your search above and press return to search.

ఏపీ స‌చివాల‌యంలో అగ్ని ప్ర‌మాదం.. చంద్ర‌బాబు రియాక్ష‌న్ ఇదే!

రాజ‌ధాని అమ‌రావతిలో ఉన్న ప్ర‌ధాన స‌చివాల‌యంలో శుక్ర‌వారం భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.

By:  Tupaki Desk   |   4 April 2025 9:45 AM
ఏపీ స‌చివాల‌యంలో అగ్ని ప్ర‌మాదం.. చంద్ర‌బాబు రియాక్ష‌న్ ఇదే!
X

రాజ‌ధాని అమ‌రావతిలో ఉన్న ప్ర‌ధాన స‌చివాల‌యంలో శుక్ర‌వారం భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. రెండో బ్లాక్‌లో ఉద‌యం 8-9 గంట‌ల మ‌ధ్య చోటు చేసుకున్న ఈ ప్ర‌మాదం అనేక అనుమానాల‌కు తావిచ్చింది. స‌చివాల‌యంలోని రెండో బ్లాక్‌లో బ్యాటరీలు నిల్వ చేసే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. అయితే.. ఈ విష‌యాన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది.. వెంట‌నే అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సేఫ్టీ సిబ్బంది రంగంలోకి దిగి.. మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు.

అయితే.. ఈ ప్ర‌మాదం వెనుక‌.. కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతు న్నారు.ఇక‌, ఈ బ్లాక్‌లో .. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నా యి. అగ్నిప్రమాదం జరిగిన స‌మ‌యంలో సిబ్బంది ఎవరూ కార్యాలయం లోపల లేరని ఉన్న‌తాధికారులు గుర్తించారు.

ఇక‌, ఈ ఘ‌ట‌న గురించి తెలిసిన వెంట‌నే త‌న‌షెడ్యూల్ మొత్తాన్నీ ప‌క్క‌న పెట్టిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బా బు.. స‌చివాల‌యానికి వెళ్లారు. అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకున్న ప్రాంతాన్ని ప‌రిశీలించారు. దీనివెనుక వైసీపీ నేత‌ల కుట్ర ఉంద‌ని భావిస్తున్న‌ట్టు కొంద‌రు టీడీపీనాయ‌కులు వ్యాఖ్యానించారు. అయితే.. ఆధారాలు లేకుండా చేసే విమ‌ర్శ‌లు ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం తెప్పిస్తుంద‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఆధారాలు వ‌చ్చే వ‌ర‌కు దీనిపై వేచి చూడాల్సిందేన‌ని అన్నారు.

మ‌రోవైపు.. ఈ బ్లాక్‌లోనే కీల‌క ప‌త్రాల స్టోరేజీ ఉంద‌ని అధికారులు తెలిపారు. గత ఏడాది ఎన్నిక‌ల అనం తరం.. వైసీపీ ప్ర‌బుత్వానికి సంబంధించి తీసుకున్న నిర్ణ‌యాలు, ఇచ్చిన జీవోల‌కు సంబంధించిన కీల‌క ప‌త్రాల‌ను ఇక్క‌డే నిక్షిప్తం చేశామ‌ని వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో స‌ద‌రు ప‌త్రాల‌ను త‌గ‌ల‌బెట్టేందుకే.. వైసీపీ నాయ‌కులు ఇలా కుట్ర‌లు చేసి ఉంటార‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. చంద్ర‌బాబు మాత్రం ఈ విష‌యంలో ఆధారాలు లేకుండా ఎవ‌రూ ఏమీ మాట్లాడ‌వ‌ద్ద‌ని తేల్చిచెప్పారు.