Begin typing your search above and press return to search.

"చింతా మత్ కరో"... ఎంఐ ఓనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అవును... ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీ మార్పు నిర్ణయం పలువురు అభిమానులను షాక్‌ కు గురి చేసిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   21 Dec 2023 3:15 AM GMT
చింతా మత్ కరో... ఎంఐ ఓనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
X

ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ అవ్వడానికి ముందు లక్షణాలు భారీగా కనిపిస్తున్నాయి! దుబాయ్ వేదికగా ఐపీఎల్ వేలం జరగడంతో ఈ చర్చ మరింత రసవత్తరంగా మారింది. అంతకంటే ముందు ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి హార్ధిక్ పాండ్యాని నియమించడంతో రచ్చ మొదలైంది. ఈ విషయాన్ని ఎంఐ ఫ్యాన్స్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీ మార్పు నిర్ణయం పలువురు అభిమానులను షాక్‌ కు గురి చేసిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ ను ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మకు బదులు హార్దిక్‌ పాండ్యను కెప్టెన్ గా నియమించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియా వేదికగా ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీపై విమర్శలు చేస్తున్నారు. లక్షల సంఖ్యలో అభిమానులు ఆ జట్టు సోషల్‌ మీడియా ఖాతాలను అన్‌ ఫాలో చేస్తున్నారు.

ఈ సమయంలో ఐపీఎల్‌ వేలం సందర్భంగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ ఈ వేలానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీగానే వేదిక వద్దకు వచ్చిన అభిమానుల్లో ఎంఐ ఫ్యాన్స్ కూడా ఎక్కువమందే ఉన్నారు! ఈ సమయంలో వేదిక బయట ఫ్యాన్స్‌ "రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్‌ గా నియమించండి" అంటూ నినాదాలు చేశారు.

దీంతో ఈవిధంగా నినాదాలు చేస్తున్న ఫ్యాన్స్ కి ఆకాశ్ అంబానీ సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా... "ఎటువంటి ఆందోళన వద్దు. అతడు బ్యాటింగ్‌ చేస్తాడు" అని వ్యాఖ్యానించారు! దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

మాజీ క్రికెటర్ మంజ్రేకర్‌ వెర్షన్ ఇది!:

తమ కెప్టెన్ ను మారుస్తూ ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్‌ స్పందించారు. ఇందులో భాగంగా ఆ నిర్ణయాన్ని ఆయన సమర్థించాడు. దీనిని సెంటిమెంట్‌, ఎమోషనల్‌ కోణంలో చూడొద్దని అభిమానులకు సూచించాడు. హార్దిక్‌ పాండ్యను కెప్టెన్‌ గా నియమించడం మంచి నిర్ణయమే అని అన్నాడు. ఇదే సమయంలో హార్దిక్‌ మాత్రం ఇలాంటి వాటితో ఎలాంటి ఒత్తిడికి గురి కాడని భావిస్తున్నట్లు తెలిపాడు.