వైరల్... ఎయిరిండియా బోయింగ్ విమానం పైలెట్ ఆడియో వెలుగులోకి!
ఈ సమయంలో తమ ప్రయాణాన్ని కొనసాగించలేమని తెలిపారు. దీనికి సంబంధించిన ఆడియో వెలుగులోకి వచ్చింది.
By: Tupaki Desk | 16 Jun 2025 4:52 PM ISTఅహ్మదాబాద్ ఘటన అనంతరం ఎయిరిండియా విమానాలకు సంబంధించి వరుస ఘటనలు తెరపైకి వస్తున్నాయి. దీంతో... ఈ వరుస ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ సంస్థకు చెందిన బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఘటన మరవకముందే.. మరో విమానంలో సాంకేతికలోపం ప్రయాణికులను కలవరపాటుకు గురిచేయగా.. ఆ సమయంలో పైలెట్ మాట్లాడిన ఆడియో వెలుగులోకి వచ్చింది.
అవును... ఎయిరిండియా విమానాలకు సంబంధించిన వరుస ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోన్నాయి. ఇప్పటికే అహ్మదాబాద్ ఘటన ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేయగా.. ఆ తర్వాత కూడా వరుసగా ఎయిరిండియా విమానాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ సమయంలో.. హాంకాంగ్ నుంచి ఢిల్లీ వస్తోన్న ఎయిరిండియా విమానంలో సాంకేతిన సమస్యను గుర్తించడంతో దాన్ని వెనక్కి మళ్లించారు.
దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. ఎయిరిండియా విమానాలకు ఏమైంది? అనే ప్రశ్నలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో.. టెకాఫ్ అయిన సుమారు 90 నిమిషాల తర్వాత హాంకాంగ్ కు తిరిగి వచ్చిన ఎయిరిండియా విమానం పైలట్లు.. అనుమానిత సాంకేతిక సమస్య ఉందని.. ఈ సమయంలో తమ ప్రయాణాన్ని కొనసాగించలేమని తెలిపారు. దీనికి సంబంధించిన ఆడియో వెలుగులోకి వచ్చింది.
ఇందులో భాగంగా... ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) తో మాట్లాడిన హాంకాంగ్ టు ఢిల్లీ పైలెట్.. తమ ప్రయాణాన్ని కొనసాగించడం ఇష్టం లేదని, ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి రావాలని కోరుకోవడం లేదని చెబుతున్నారు. అనంతరం తిరిగి హాంకాంగ్ విమానాశ్రయానికి వెళ్లారు.
కాగా... ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం సోమవారం ఉదయం హాంకాంగ్ విమానాశ్రయం నుంచి హస్తినకు బయల్దేరింది. ఈ క్రమంలో... మధ్యాహ్నం 12:20 గంటలకు ఈ విమానం ఢిల్లీలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే... మార్గమధ్యలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ ఇన్ కమాండ్ గుర్తించారు.
దీంతో.. అప్రమ్తతమైన పైలట్లు ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని వెనక్కి మళ్లించారు. అదృష్టవశాత్తు ఈ విమానం హాంకాంగ్ ఎయిర్ పోర్టులోనే సురక్షితంగా దిగింది. ఈ క్రమంలో.. ప్రయాణికులందరినీ దించేసిన అధికారులు.. విమానంలో తనిఖీలు చేపట్టారు.
