ఎయిరిండియాలో ఎఫ్.సీ.ఎస్ తనిఖీలు పూర్తి... రిజల్ట్ ఏమిటంటే..!
అహ్మదాబాద్ లో జరిగిన ఘోర ప్రమాదం అనంతరం ఎయిరిండియాలో తనిఖీలపై డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 July 2025 3:52 PM ISTఅహ్మదాబాద్ లో జరిగిన ఘోర ప్రమాదం అనంతరం ఎయిరిండియాలో తనిఖీలపై డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా బోయింగ్ 787 ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక.. ప్రమాదానికి ముందు స్విచ్ లు ఆపివేయబడ్డాయని పేర్కొన్న కొద్దిసేపటికే డీజీసీఏ నుంచి ఈ ఆదేశం వచ్చింది. ఈ సమయంలో ఎయిరిండియా స్పందించింది.
అవును... బోయింగ్ 787, 737 విమానాలలో ఇంధన స్విచ్ లాకింగ్ (ఎఫ్.సీ.ఎస్) వ్యవస్థను తనిఖీ చేయాలని విమానయాన సంస్థలను కోరుతూ జూలై 14న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... తాజాగా ఎయిరిండియా ఆ తనిఖీలను పూర్తి చేసింది.. ఫలితాన్ని వెల్లడించింది.
ఈ సందర్భంగా స్పందించిన ఎయిరిండియా సంస్థ... తన విమానంలోని అన్ని బోయింగ్ 787, బోయింగ్ 737 విమానాలలో ఇంధన నియంత్రణ స్విచ్ ల లాకింగ్ విధానంపై ముందు జాగ్రత్త తనిఖీలను పూర్తి చేసిందని తెలిపింది. ఈ సందర్భంగా... ఎటువంటి సమస్యలు కనుగొనబడలేదని ఎయిర్ లైన్స్ నిర్ధారించింది. ఈ విషయాన్ని నియంత్రణ సంస్థకు తెలిపింది!
కాగా.. జూలై 12న విడుదలైన బోయింగ్ 787-8 ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికలో.. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ).. విమానం రెండు ఇంజిన్ లకు ఇంధన సరఫరా ఒక సెకను వ్యవధిలో నిలిపివేయబడిందని, దీని వలన టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కాక్ పిట్ లో గందరగోళం ఏర్పడిందని పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా... కాక్ పిట్ వాయిస్ రికార్డింగ్ లో ఒక పైలట్ లలో మరొకరితో.. ఫ్యుయల్ స్విచ్ లు ఎందుకు ఆఫ్ చేశావు అని అడుగుతున్నట్లు వినబడగా... అందుకు సమాధానంగా మరొక పైలట్.. తాను అలా చేయలేదని స్పందించారు అని నివేదిక పేర్కొంది. ఈ సమయంలో... తనిఖీలు చేపట్టిన ఎయిరిండియా.. అన్ని బోయింగ్ విమానాల్లోనూ స్విచ్ ల తనిఖీలు చేపట్టింది.. సమస్యేమీ లేదని తెలిపింది.
