Begin typing your search above and press return to search.

మానవ విలువలపై సాంకేతికత విజయం సాధిస్తోందా? గందరగోళంలో భవిష్యత్ ప్రయాణం

కరోనా మహమ్మారి నేర్పిన పాఠాల నుంచి తేరుకోకముందే మానవాళిని మరో మహమ్మారి లాంటి అనిశ్చితి చుట్టుముట్టింది.

By:  A.N.Kumar   |   8 Sept 2026 11:53 AM IST
మానవ విలువలపై సాంకేతికత విజయం సాధిస్తోందా? గందరగోళంలో భవిష్యత్ ప్రయాణం
X

ఉదయాన్నే నిద్రలేవగానే ఫోన్ స్క్రీన్ పై ప్రత్యక్షమయ్యే పింక్ స్లిప్ ఈమెయిళ్ళు.. నెల తిరిగేసరికి కట్టాల్సిన ఈఎంఐల భయాలు... కష్టపడి చదివించిన పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రుల నిరంతర ఆరాటం... ఇది ఒకరిద్దరి కథ కాదు.. నేడు సగటు మధ్యతరగతి ఇంట్లో వినిపిస్తున్న నిశ్శబ్ద రోదన. ఒకప్పుడు జీవితమంటే ఒక డిగ్రీ, ఒక ఉద్యోగం, ఒక సొంతిల్లు అనే నమ్మకమైన ఆశల సౌధం. కానీ నేడు ఆ సౌధం ఒక్కసారిగా పునాదులతో సహా కదిలిపోతోంది. అసలు ప్రపంచం ఎటు వెళ్తోంది? రేపటి మన ఉనికికి గ్యారెంటీ ఏమిటి?

కరిగిపోతున్న ఉద్యోగ భద్రత.. టెక్నాలజీ సృష్టిస్తున్న అలజడి

కరోనా మహమ్మారి నేర్పిన పాఠాల నుంచి తేరుకోకముందే మానవాళిని మరో మహమ్మారి లాంటి అనిశ్చితి చుట్టుముట్టింది. అదే 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ) సృష్టిస్తున్న అభద్రతాభావం. నిన్నటివరకు గంటల తరబడి కష్టపడి చేసిన కోడింగ్, కంటెంట్ రైటింగ్, డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్ వంటి పనులను నేడు ఏఐ క్షణాల్లో పూర్తి చేస్తోంది. కంపెనీలకు లాభాల పంట పండుతోంది. కానీ దశాబ్దాలుగా రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసిన ఉద్యోగికి మాత్రం "ఇక నీ అవసరం మాకు లేదు" అనే నిర్దాక్షిణ్యమైన సమాధానం మిగులుతోంది.

ఇది కేవలం కెరీర్ ప్రారంభంలో ఉన్న యువతకే పరిమితం కావడం లేదు. పదేళ్ళు, పదిహేనేళ్ళు అనుభవం ఉండి కుటుంబ బాధ్యతలను భుజాన మోస్తున్న సీనియర్ ఉద్యోగులను సైతం లేఆఫ్‌ల పేరుతో రోడ్డున పడేస్తున్నారు. రేపు ఏజీఐ, ఏఎస్ఐ వంటి మరింత శక్తివంతమైన ఏఐ సాంకేతికతలు వస్తే మానవ శ్రమకు అసలు విలువ ఉంటుందా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

కలల సౌధం రియల్ ఎస్టేట్... నేడు భారంగా మారిన నిజం

జీవితకాల సంపాదనను ధారపోసి 20-30 ఏళ్ళ ఈఎంఐల భారాన్ని తలపై వేసుకుని కట్టుకునే సొంతింటి కల కూడా ఇప్పుడు ఒక దిగులుగా మారింది. ఉద్యోగానికి గ్యారెంటీ లేని వేళ ఆకాశాన్నంటిన లగ్జరీ అపార్ట్‌మెంట్ల ధరలు, మందగించిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు మధ్యతరగతికి నిద్రలేకుండా చేస్తున్నాయి. "రేపు ఉద్యోగం ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో ఇన్ని లక్షల అప్పు చేసి ఇల్లు కొనడం అవసరమా?" అని ప్రతి ఒక్కరూ వెనకడుగు వేస్తున్నారు. దీనికి తోడు ప్రపంచవ్యాప్త యుద్ధాలు, ఆర్థిక మందగమనం జీవన వ్యయాన్ని ఆకాశానికి ఎత్తేశాయి.

విద్యార్థుల కళ్ళల్లో కన్నీళ్లు.. కోల్పోతున్న పాత సమీకరణాలు

లక్షలు ఖర్చు చేసి ఇంజినీరింగ్, ఇతర ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రుల కళ్ళల్లో ఇప్పుడు ఆనందానికి బదులు ఆందోళన కనిపిస్తోంది. "డిగ్రీ పూర్తికాగానే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. భారీ ప్యాకేజీలు" అనే పాత సమీకరణాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కొత్త నియామకాలు నిలిచిపోవడం.. నైపుణ్యాల అంచనాలు రోజురోజుకూ మారిపోతుండటంతో యువత తీవ్ర నిరాశలో కూరుకుపోతోంది.

భయం వెనుక దాగిన కొత్త ఆశ.. మార్పే మన మార్గం

అయితే చరిత్రను ఒక్కసారి తిరగేస్తే ఒక సత్యం బోధపడుతుంది. చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత దగ్గరలో ఉన్నట్లే. సాంకేతికతను భయపడకుండా ముందడుగు వేయాలి. ఏఐ మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదు.. అదొక సాధనం మాత్రమే. దానికి భయపడటం కంటే, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవడమే నేటి అవసరం. ఒకే డిగ్రీ, ఒకే నైపుణ్యంతో జీవితాంతం బతికేయాలనే ఆలోచనను పక్కనబెట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా మనల్ని మనం రీ-స్కిల్ చేసుకోవాలి. అనవసరపు అప్పులు తగ్గించుకుని అత్యవసర సమయాలకు ఉపయోగపడేలా పొదుపు వైపు దృష్టి సారించాలి.

ప్రపంచం మారుతోంది.. ఆ మార్పుతో పాటు మనమూ మారక తప్పదు. భవిష్యత్తుపై భయం రావడం సహజమే కానీ ఆ భయాన్ని నిరాశగా మారనివ్వకూడదు. పడిలేచిన కెరటంలా అనిశ్చితిని ఆసరాగా చేసుకుని కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడమే మానవ జీవన సౌందర్యం.