గొట్టిపాటితో జూనియర్ కరణం ఢీ ?
ప్రకాశం జిల్లాలో అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీకి కొరుకుడు పడడం లేదు.
By: Tupaki Desk | 9 May 2025 9:19 AM ISTప్రకాశం జిల్లాలో అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీకి కొరుకుడు పడడం లేదు. ఇక్కడ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సుదీర్ఘ కాలం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. 2014లో వైసీపీలో చేరి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు, ఆ తరువాత ఆయన టీడీపీలోకి చేరిపోయారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం గెలిచిన ఘనత గొట్టిపాటిది. దాని ఫలితమే అనుకోవాలి 2024లో ఆయన మరోసారి గెలవగానే చంద్రబాబు మంత్రివర్గంలో కీలకమైన విద్యుత్ శాఖ మంత్రిగా అవకాశం దక్కింది.
దాంతో గొట్టిపాటి బలమైన నేతగా అక్కడ ఉన్నారు. ఆయనను తట్టుకోవడం కష్టమని వైసీపీ భావిస్తోంది. వైసీపీ నుంచి ఎవరికి దించినా ఓటమి తప్పడం లేదు. ఇక చూస్తే కనుక 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన హనీమీ రెడ్డి ఎన్నికల తరువాత పూర్తిగా చురుకుదనంతో లేరు. దాంతో క్యాడర్ నిరుత్సాహంతో ఉంది.
మరో వైపు వార్ వన్ సైడ్ అన్నట్లుగా గొట్టిపాటి అద్దంకిలో దూసుకుని పోతున్నారు. తన కత్తికి ఎదురులేదని ఆయన జోరు చేస్తున్నారు. ఈ క్రమంలో గొట్టిపాటి హవాకు బ్రేకు వేసి 2029లో అయినా వైసీపీ జెండా అద్దంకిలో ఎగిరేలా చూడాలని వైసీపీ శతవిధాలుగా ప్రయత్నం చేస్తోంది.
ఇందులో భాగంగా కరణం బలరామక్రిష్ణమూర్తికి ఒకనాడు కంచుకోట అయిన అద్దంకిని మళ్ళీ ఆ ఫ్యామిలీకే అవకాశం ఇవ్వడం ద్వారా రవికుమార్ ని ఓడించాలని ప్లాన్ వేస్తోంది ఇక చూస్తే కనుక కరణం బలరాం క్రిష్ణమూర్తి 1978లో తొలిసారి కాంగ్రెస్ టికెట్ మీద అద్దంకి నుంచి గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరి 2004లో అదే సీటు నుంచి కరణం బలరాం గెలిచారు. 2009లో గొట్టిపాటి చేతిలో ఓటమి పాలు అయ్యారు.
ఇక 2014లో కరణం బలరాం కుమారుడు వెంకటేష్ టీడీపీ నుంచి పోటీ చేసినా వైసీపీ నుంచి బరిలోకి దిగిన గొట్టిపాటి చేతిలో పరాజయం తప్పలేదు. 2019లో చూస్తే కరణాన్ని చీరాలకు పంపించి పార్టీలో చేరిన గొట్టిపాటికి టీడీపీ అధినాయకత్వం టికెట్ ఇచ్చింది. ఆ తర్వాత కరణం వైసీపీలోకి వచ్చారు. 2024 ఎన్నికల్లో చీరాల నుంచి కరణం బలరాం కుమారుడు వెంకటేష్ వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.
ఇపుడు చూస్తే చీరాల రాజకీయాల్లోనే కరణం ఫ్యామిలీ బిజీగా ఉంది. అయితే కరణం వెంకటేష్ ని అద్దంకి తీసుకుని వచ్చి ఇంచార్జి బాధ్యతలు అప్పగించడం ద్వారా గొట్టిపాటి మీద 2029 ఎన్నికల్లో పోటీ చేయించాలని వైసీపీ హైకమాండ్ చూస్తోంది అని అంటున్నారు. ఇక చూస్తే కరణం గొట్టిపాటి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు.
అయితే ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరం అయితే సాగుతోంది. గొట్టిపాటిని పార్టీలోకి తెచ్చారనే కరణం అలిగి వైసీపీలోకి వెళ్ళారని చెబుతారు. దీంతో అద్దంకి నుంచి వైసీపీ తరఫున పోటీ అంటే కరణం ఫ్యామిలీ ఎస్ అని చెప్పవచ్చు అని అంటున్నారు. అయితే కరణం వెంకటేష్ కి గొట్టిపాటితో పోటీ కొత్త కాదు 2014లోనే టీడీపీ నుంచి పోటీ చేసి ఓడారు.
ఇక ఇపుడు ఇద్దరూ పార్టీలు మారి మళ్ళీ 2029లో తలపడితే ఎవరు విజేత అన్నది చూడాల్సి ఉంది. ఇద్దరికీ బలాలు ఉన్నాయి. సామాజిక వర్గాల పరంగా దన్ను ఉంది. దాంతో గొట్టిపాటి వర్సెస్ కరణం అంటే అద్దంకిలో రాజకీయ సమరం 2029లో రసవత్తరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.