Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ నాటిన మొక్కే బీజేపీని నాశనం చేసింది: విజయశాంతి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాటిన ఒక మొక్క బీజేపీని నాశనం చేసిందని తాజాగా కాంగ్రెస్‌ లో చేరిన విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   18 Nov 2023 9:55 AM GMT
కేసీఆర్‌ నాటిన మొక్కే బీజేపీని నాశనం చేసింది: విజయశాంతి సంచలన వ్యాఖ్యలు!
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాటిన ఒక మొక్క బీజేపీని నాశనం చేసిందని తాజాగా కాంగ్రెస్‌ లో చేరిన విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ని ఉద్దేశించి ఆమె హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఈటలపై కేసీఆర్‌ పెట్టిన కేసులు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. బీజేపీ దానికదే నాశనం అయిందని విజయశాంతి అన్నారు.

బండి సంజయ్‌ ని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చడంతోనే బీజేపీ గ్రాఫ్‌ పడిపోయిందని విజయశాంతి వెల్లడించారు. బండి సంజయ్‌ ని ఆకస్మాత్తుగా తీసేశారు. ఆయనను తీసేయవద్దని చెప్పాను. సంజయ్‌ ని తీసివేయడం లేదని మాకు చెప్పి సడన్‌ గా అధ్యక్ష పదవి నుంచి తప్పించారని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తప్పు చేసింది కాబట్టే కాంగ్రెస్‌ పార్టీలో చేరానన్నారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశానని తెలిపారు.

ఉద్యమకారులకు బీజేపీ మాట ఇచ్చిందని.. కేసీఆర్‌ అవినీతిపై చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ ఒక నమ్మకాన్ని ఇచ్చింది కాబట్టే బీజేపీలోకి వెళ్లానని విజయశాంతి తెలిపారు. బీజేపీలోకి వెళ్లి నెలలు, సంవత్సరాలు గడిచినా కేసీఆర్‌పై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్‌ పై చర్యలు ఎందుకు తీసుకోలేదో మోదీ చెప్పాలన్నారు. ఆధారాలు ఉన్నా కేసీఆర్‌ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా తెలంగాణకి వచ్చినప్పుడల్లా కేసీఆర్‌ పై ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. కానీ చర్యలు మాత్రం తీసుకోలేదని విజయశాంతి ఆరోపించారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని విజయశాంతి హాట్‌ కామెంట్స్‌ చేశారు. బీజేపీ కార్యకర్తలు పిచ్చోళ్లన్నారు. బీజేపీ బయటకి మాట్లాడేది ఒకటి.. తెర వెనుక జరిగేది ఒకటన్నారు. కేసీఆర్‌ అవినీతిపై కాంగ్రెస్‌ పోరాడుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

కొందరు మీడియా వ్యక్తులు తనపై ఘాటైన హెడ్‌ లైన్స్‌ పెట్టారని విజయశాంతి మండిపడ్డారు. తన ను తిట్టే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇచ్చే డబ్బులకి లొంగిపోయే వ్యక్తిని తాను కాదన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి తనపై మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకి మంచి బుద్ధి రావాలని కోరుకుంటున్నానన్నారు.

తనను విమర్శించే వాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలని విజయశాంతి హెచ్చరించారు. కేసీఆర్‌ తనను సస్పెండ్‌ చేశారని.. అయితే తానే రాజీనామా చేశానని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌ని గద్దె దింపడం కోసం ఎంత దూరమైనా వెళ్తానన్నారు. ఆనాటి కాంగ్రెస్‌ నాయకుల్లో కొంతమందిని కేసీఆర్‌ కొన్నారని బాంబుపేల్చారు. కాంగ్రెస్‌ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.