Begin typing your search above and press return to search.

రాజస్థాన్‌ లో పెద్ద భవనం... సొంతపిల్లల భిక్షాటనతో సంపాదించడం!

అవును... డబ్బులు సంపాదించడానికి భిక్షాటనకు మించిన సులువైన మార్గం ఏముంది అనుకుందో ఏమో కానీ... అందుకు తన సొంతపిల్లలనే పావులుగా వాడుకుంది ఓ మహిళ.

By:  Tupaki Desk   |   14 Feb 2024 3:30 PM GMT
రాజస్థాన్‌  లో పెద్ద భవనం... సొంతపిల్లల  భిక్షాటనతో సంపాదించడం!
X

కాకిపిల్ల కాకికి ముద్దు, హంసపిల్ల హంసకు ముద్దు... దారుణమేమిటో కానీ మనిషి బిడ్డ మనిషికి ముద్దుకాకుండా పోతున్నాడు! ఇటీవల కాలంలో దీనికి ఉదాహరణలుగా ఎన్నో సంఘటనలు తెరపైకి వస్తున్నాయి. కన్న తండ్రే కాలయముడై కూతుర్లపై అత్యాచారాలు చేసిన ఘటనలూ తెరపైకి వచ్చాయి. కన్న బిడ్డలను ముళ్లకంపల మధ్యకు విసిరేసిన తల్లుల కథనాలూ వచ్చాయి! ఈ సమయంలో సొంత బిడ్డలతో బలవంతంగా భిక్షాటన చేయించిన మహిళ వ్యవహారం తెరపైకి వచ్చింది.

అవును... డబ్బులు సంపాదించడానికి భిక్షాటనకు మించిన సులువైన మార్గం ఏముంది అనుకుందో ఏమో కానీ... అందుకు తన సొంతపిల్లలనే పావులుగా వాడుకుంది ఓ మహిళ. ఈ సమయంలో కేవలం 45 రోజుల్లో రెండున్నర లక్షలకు పైగా సంపాదించిందట. అలా తాను కష్టపడకుండా.. కడుపున పుట్టినవారిని యాచనలోకి దింపి లక్షలు సంపాదిస్తూ తాను సుఖపడుతుంది. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది.. ఆ మహిళ ఎవరు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం!

వివరాళ్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్‌ లోని ఇండౌర్‌ లో ఓ మహిళ తన ఎనిమిదేళ్ల కుమార్తె, ఇద్దరు కుమారులతో భిక్షాటన చేయించడం మొదలుపెట్టి లక్షల్లో డబ్బులు సంపాదిస్తుంది. ఇందులో భాగంగా... 45 రోజుల్లోనే 2.5 లక్షలు సంపాదించిందని తెలుస్తుంది. ఇండౌర్‌ ను బెగ్గర్ ఫ్రీ సిటీగా మర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టులో పని చేస్తున్న “ప్రవేశ్‌” అనే స్వచ్ఛంద సంస్థ వీరిని గుర్తించింది.

ఈ సందర్భంగా ఈ విషయాలపై స్పందించిన ప్రవేశ్‌ ఎన్‌.జీ.ఓ అధ్యక్షురాలు రూపాలీ జైన్‌... విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారికి ఒక అమ్మాయి దొరికిందని, ఇద్దరు అబ్బాయిలూ పారిపోయారని, దొరికిన ఆమెను చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి అప్పజెప్పామని తెలిపారు. ఇక ఆ పిల్లల తల్లి ఇండౌర్ - ఉజ్జయిని రోడ్డులోని లవ్ - కుశ్‌ జంక్షన్ లో పట్టుకున్నామని తెలిపారు.

అనంతరం జరిగిన విచారణలో ఆమె వెల్లడించిన విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఐదుగురు పిల్లలున్న ఆ మహిళ.. ప్రస్తుతం ముగ్గురు పిల్లలతో ఈపని చేయిస్తుందంట. ఇందులో భాగంగా 45 రోజుల్లో సుమారు 2.5 లక్షలు సంపాదించినట్లు తెలిపింది. ఇందులో లక్ష రూపాయలు అత్తామామలకు పంపగా.. 50వేలు బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు వెల్లడించిందట.

అక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే... రాజస్థాన్ లో ఆమెకు పెద్ద భవనంతో పాటు వ్యవసాయ భూమి కూడా ఉన్నట్లు విచారణలో తేలిందట. దీంతో ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారట.