Begin typing your search above and press return to search.

ఆ భారీ ప్రాజెక్టుకు 2019లోనే 500 కోట్లతో రిపేర్లు.. గప్ చుప్?

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ అక్టోబరు నెలలో కుంగిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   9 Jan 2024 11:32 AM GMT
ఆ భారీ ప్రాజెక్టుకు 2019లోనే 500 కోట్లతో రిపేర్లు.. గప్ చుప్?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట అత్యంత వివాదాస్పదమైన ప్రాజెక్టు అది.. అంతకుముందటి ఎన్నికల మధ్య ఓ పార్టీ గెలుపునకు దోహదపడిన ప్రాజెక్టు అది.. తెలంగాణ సమాజంలో అత్యంత చర్చనీయాంశమైన ప్రాజెక్టు అది.. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు నీరందించినట్లుగా లెక్కలు బయటకు వచ్చిన ప్రాజెక్టు అది.. అలాంటి భారీ నిర్మాణం సరిగ్గా ఎన్నికల ముంగిట కుంగింది. అప్పటి ప్రభుత్వాన్ని అప్రదిష్ఠ పాల్జేసింది.

ఆ వరదల్లో దెబ్బతిన్నదా..

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ అక్టోబరు నెలలో కుంగిన సంగతి తెలిసిందే. అది తీవ్ర వివాదాస్పదం అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత సమర్థించుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలు కూడా పరిశీలించి నిర్మాణాన్ని తప్పుబట్టాయి. ఇదే అన్నారం బ్యారేజీలోనూ లోపాలు బయటపడ్డాయి. మొత్తానికి ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఎన్నికల్లో ఓటమికూడా చెందింది. కాగా.. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన తీవ్ర వివాదాస్పదమైన అంశం మరొకటి బయటకు వస్తోంది. దీనిపై నిజానిజాలు ఎంతో తెలియాల్సి ఉంది. అయితే, ఈ కథనాల ప్రకారం కాళేశ్వరంలో భాగమైన మూడు బ్యారేజీలు మేగిగడ్డ, అన్నారం, సుందిళ్ల 2019లో వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయంట. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.500 కోట్లను పెట్టి మరమ్మతు చేయించిందట. ఈ విషయం అసలు బయటకు రాకుండా చూసిందట. కాంట్రాక్టురు మరమ్మతుకు అంగీకరించకపోడంతో గత సర్కారే చేతుల్లోంచి పెట్టుకుందట.

సరిగ్గా ఎప్పుడు జరిగిందంటే..?

వరదలు సంభవించిన నేపథ్యంలో.. 2019 నవంబరులో కాళేశ్వరం బ్యారేజీల్లోని ఆర్సీసీ కోటింగ్, సీసీ కర్టైన్ వాల్స్, సీసీ బ్లాక్స్, బ్యారేజీల కిందిభాగంలో ఉండే ఆప్రాన్ కొట్టుకుపోయిందట. రూ.180 కోట్లతో (మేడిగడ్డలో రూ.83 కోట్లు, అన్నారంలో రూ.65 కోట్లు, సుందిళ్లలో రూ.32 కోట్లు) ప్రాథమికంగా మరమ్మతులు చేసినా.. మొత్తం నష్టాన్ని పూడ్చేందుకు రూ.500 కోట్లు వ్యయం అయిందని లెక్క. కాగా, ఈ విషయాన్ని కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుబట్టినా.. బీఆర్ఎస్ సర్కారు తొక్కిపట్టిందట. మేడిగడ్డ కుంగిన సందర్భంలో ఖర్చంతా కాంట్రాక్టురుదేనని అప్పటి ప్రభుత్వ పెద్దలు వాదించారు. దీనిపైనా తర్వాత తీవ్ర విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. మరిప్పుడు ఏం జరగనుందో చూడాలి.

10 టీమ్ లతో విజిలెన్స్ సోదాలు..

కాళేశ్వరంలో మరో మలుపు తరహాలో.. విజిలెన్స్‌- ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌ జల సౌధలోని కాళేశ్వరం కార్పొరేషన్‌ కార్యాలయంలో ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ కాకుండా.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ లోని సాగునీటి డివిజన్‌ కార్యాలయాల్లో మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌ హౌస్‌ రికార్డులు, కరీంనగర్‌ లోయర్ మానేరు డ్యాంలోని ఇరిగేషన్‌ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ సోదాల్లో 10 ఇంజినీరింగ్‌, విజిలెన్స్‌ బృందాలు పాల్గొనడం గమనార్హం.