అధికారిక లెక్కలు తప్పా?.. కోవిడ్ మరణాలపై షాకింగ్ రివీల్!
కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అయితే, అప్పట్లో ప్రభుత్వాలు చెప్పిన మరణాల లెక్కల కంటే వాస్తవ పరిస్థితి చాలా భయంకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ బాంబు పేల్చింది.
By: Madhu Reddy | 15 May 2026 5:00 AM ISTకరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అయితే, అప్పట్లో ప్రభుత్వాలు చెప్పిన మరణాల లెక్కల కంటే వాస్తవ పరిస్థితి చాలా భయంకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ బాంబు పేల్చింది. 2020 నుంచి 2023 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2.21 కోట్ల మంది అదనంగా చనిపోయారని తాజాగా ప్రకటించింది. అంటే అప్పట్లో మనం విన్న 70 లక్షల మరణాల లెక్క కేవలం ఒక చిన్న భాగం మాత్రమేనని అర్థమవుతోంది.ఆ వివరాలు ఇలా వున్నాయి..
పెరిగిన మరణాల గ్రాఫ్:
కరోనా మొదలైనప్పటి నుండి 2023 వరకు జరిగిన మరణాలపై WHO లోతైన అధ్యయనం చేసింది. గతంలో సుమారు 70 లక్షల మంది మరణించారని అంచనా వేసిన ఈ సంస్థ, ఇప్పుడు ఆ లెక్కను సవరించింది. కొత్త గణాంకాల ప్రకారం 2.21 కోట్ల మంది అదనంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక అంటే అధికారిక లెక్కల కంటే వాస్తవ మరణాలు మూడు రెట్లు ఎక్కువగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అసలు లెక్కలు ఎందుకు తప్పాయి?:
మరణాల సంఖ్య ఇంత భారీగా పెరగడానికి కారణం.. అనేక దేశాలు మరణాలను సరిగ్గా నమోదు చేయకపోవడమేనని WHO స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన మరణాలు, టెస్టులు చేయించుకోకుండా ప్రాణాలు కోల్పోయిన వారు, ఇతర ఆరోగ్య సమస్యలతో కరోనా వల్ల చనిపోయిన వారి వివరాలు చాలా చోట్ల రికార్డు కాలేదు. ఇక దీనివల్ల వాస్తవ పరిస్థితులు బయటపడలేదని సంస్థ వెల్లడించింది.
అదనపు మరణాలు అంటే ఏమిటి?:
సాధారణంగా ఏటా జరిగే మరణాల కంటే, మహమ్మారి వంటి విపత్తు సమయాల్లో ఎక్కువగా సంభవించే మరణాలను 'అదనపు మరణాలు' అంటారు. కేవలం వైరస్ సోకి చనిపోయిన వారే కాకుండా, ఆసుపత్రులు నిండిపోవడం వల్ల చికిత్స అందక చనిపోయిన వారు, ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు విడిచిన వారు కూడా ఈ 2.21 కోట్ల మంది జాబితాలోకి వస్తారు.
గుణపాఠం నేర్చుకోవాల్సిందే:
ప్రపంచ దేశాలు మరణాల నమోదు విషయంలో పారదర్శకంగా ఉండాలని WHO సూచిస్తోంది. ఈ గణాంకాలు కేవలం పాత లెక్కల కోసం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులు వచ్చినప్పుడు ఎలా సిద్ధంగా ఉండాలో ప్రణాళికలు వేసుకోవడానికి పనికొస్తాయి. ఇక ఇప్పటికీ కొన్ని దేశాలు తమ డేటాను సరిగ్గా పంచుకోవడం లేదని సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.
మొత్తానికి కోవిడ్ మనకిచ్చిన గాయం మనం అనుకున్న దానికంటే చాలా లోతైనదని ఈ లెక్కలు చెబుతున్నాయి. మరణించిన వారు తిరిగి రారు కానీ, భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు వైద్య వ్యవస్థలను ఎలా బలోపేతం చేసుకోవాలో ఈ షాకింగ్ గణాంకాలు గుర్తు చేస్తున్నాయి.
