ఆ ప్రకటనతో రోజులో రూ.7.85 లక్షల కోట్ల సంపద పెరిగింది
చిన్న విషయాలకే సీరియస్ గా స్పందించే స్టాక్ మార్కెట్.. భారీ ప్రకటనలు మార్కెట్ ను ఎంతలా ప్రభావితం చేస్తున్నది చూస్తున్నాం.
By: Tupaki Desk | 12 April 2025 4:50 AMచిన్న విషయాలకే సీరియస్ గా స్పందించే స్టాక్ మార్కెట్.. భారీ ప్రకటనలు మార్కెట్ ను ఎంతలా ప్రభావితం చేస్తున్నది చూస్తున్నాం. వరుస నష్టాలు.. అది కూడా కనివినీ ఎరుగని రీతిలో రియాక్టు అవుతున్న సూచీల దెబ్బకు లక్షలాది కోట్ల రూపాయిలు ఇట్టే ఆవిరి అయిపోతున్న పాడు రోజుల్లో ఉన్నాం. ఒక వ్యక్తి ఆలోచనలు ప్రపంచాన్ని ఎంతలా ప్రభావితం చేస్తాయన్న దానికి నిదర్శనంగా ఈ వారం నిలిచింది. అదే సమయంలో ఒక ఊరడింపు ప్రకటన శుక్రవారం స్టాక్ మార్కెట్ కు పాజిటివ్ గా మార్చటమే కాదు.. సూచీలు లాభాలతో ముగిసాయి. వారాంతం ట్రేడింగ్ అమితోత్సాహంతో కొనుగోళ్లు చేశారు.భారత్ పై విధించిన 26 శాతం అదనపు సుంకాల అమలును అమెరికా 90 రోజుల పాటు వాయిదా వేస్తూ నిర్ణయాన్ని ప్రకటించటంతో.. వాతావరణం మారింది.
భారీగా కొనుగోళ్లు జరపటంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు భారీగా పుంచుకోవటంతో మదుపరుల సంపద శుక్రవారం ఒక్క రోజులో రూ.7.85 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇక.. సెన్సెక్స్ విషయానికి వస్తే ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఒక దశలో 1620.18 పాయింట్లు పెరిగింది. చివరకు 1310.11 పాయింట్ల లాభంతో 75,157.26 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 524.75 పాయింట్ల వృద్ధితో 23వేల స్థాయికి చేరువైంది. చివరకు 429.40 పాయింట్ల పెరుగుదలతో 22,828.55 వద్ద ముగిసింది.
బీఎస్ ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రోజులో రూ.7.85 లక్షల కోట్లకు పెరిగి రూ.401.67 లక్షల కోట్లకు చేరింది. డాలర్లలో చెప్పాలంటే 4.66 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. శుక్రవారాన్ని పక్కన పెట్టేసి.. ముగిసిన ఈ వారంలో సెన్సెక్స్ 207.43 పాయింట్లు.. నిఫ్టీ 75.9 పాయింట్ల నష్టాన్ని చవిచూశాయి.
సానుకూల వాతావరణంలో భారత కరెన్సీ విలువ భారీగా పుంజుకొని.. ఫారెక్స్ ట్రేడింగ్ లో డాలర్ తో రూపాయి మారకం విలువ రోజులో 58 పైసలు బలపడి.. రూ.86.10 వద్ద ముగిసింది. చివరగా ఈ వారం మరో మైల్ స్టోన్ కు చేరుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ఈ నెలలో యూనిక్ క్లయింట్ కోడ్స్ 22 కోట్ల మైలురాయిని చేరుకుంది. ఆర్నెల్లో మరో 2 కోట్ల మేర పెరగటం గమనార్హం. ఈ మార్చి 31 నాటికి ఎన్ఎస్ ఈ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య 11.3 కోట్లకు చేరుంది.