Begin typing your search above and press return to search.

కుర్ర హీరోలకు కుదరని ఓటీటీ డీల్స్

డిజిటల్ ఓటీటీ ఛానల్స్ లో ఆ సినిమాలకి మంచి ఆదరణ వస్తూ ఉండటంతో రైట్స్ కోసం ఎంత పెట్టడానికి అయిన సిద్ధం అయిపోతున్నాయి

By:  Tupaki Desk   |   6 Feb 2024 4:14 AM GMT
కుర్ర హీరోలకు కుదరని ఓటీటీ డీల్స్
X

ఈ మధ్యకాలంలో టైర్ 1, టైర్ 2 హీరోల చిత్రాలకి డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ముందుగానే ఓటీటీ రైట్స్ కోసం పోటీ పడుతూ ఉన్నాయి. హీరో రేంజ్ బట్టి ఎక్కువ మొత్తంలో డబ్బు ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. డిజిటల్ ఓటీటీ ఛానల్స్ లో ఆ సినిమాలకి మంచి ఆదరణ వస్తూ ఉండటంతో రైట్స్ కోసం ఎంత పెట్టడానికి అయిన సిద్ధం అయిపోతున్నాయి. అయితే వరుస ఫ్లాప్ ల మీద ఉన్న హీరోల మీద పెట్టుబడి పెట్టడానికి డిజిటల్ కంపెనీలు ఆసక్తి చూపించడం లేదు.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి చివరిగా వచ్చిన హిట్ టాక్సీవాలా. ఆ తరువాత చేసిన సినిమాలు ఏవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. గత ఏడాది వచ్చిన ఖుషి మూవీ కూడా ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీ సంస్థలు విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ కారణంగా ఆయన గత సినిమాలని ఎక్కువ పెట్టుబడి పెట్టి కొనుగోలు చేశాయి. అయితే ఆ సినిమాలకి ఓటీటీలో కూడా ఆదరణ రాలేదని తెలుస్తోంది.

దీంతో దిల్ రాజు ప్రొడక్షన్ లో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఓటీటీ హక్కుల కోసం ఒక్క కంపెనీ కూడా ముందుకి రాలేదంట. మూవీ రిలీజ్ అయిన తర్వాత టాక్ బట్టి ఓటీటీ డీల్స్ సెట్ చేసుకోవచ్చే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఈ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వబోతున్న నేపథ్యంలో ఆ లోపు ఓటీటీ డీల్ కుదురుతుందేమో అనేది వేచి చూడాలి.

ఇదే పరిస్థితి రామ్ పోతినేనిది కూడా అతను చివరిగా ది వారియర్, స్కంద సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. రెండు కూడా అల్ట్రా డిజాస్టర్ అయ్యాయి. ఈ సినిమాలకి సంబందించిన డిజిటల్ రైట్స్ ని ముందుగానే కొనడం ద్వారా ఛానల్స్ కూడా కొంత వరకు నష్టపోయాయని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం రామ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తోన్న డబుల్ ఇస్మార్ట్ కొనడానికి ఎవరూ ముందుకి రాలేదంట.

పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో పూరీ జగన్నాథ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే సినిమా డిజిటల్ హక్కులు మాత్రం ఇంకా అమ్ముడుపోలేదు. థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక మూవీ సక్సెస్ రేంజ్ బట్టి డిజిటల్ హక్కులని కొనాలని ఓటీటీ సంస్థలు భావిస్తున్నాయంట.