‘రామాయణ’ షూటింగ్పై యశ్ కీలక కామెంట్స్
మొదటి భాగంలో రాముడు, రావణుడు ఎదురుపడతారా? అసలు వీరిద్దరి మధ్య సీన్లు ఉన్నాయా? అనే విషయాలపై యశ్ క్లారిటీ ఇచ్చారు. ఆ విశేషాలు మీకోసం..
By: Madhu Reddy | 15 April 2026 4:44 PM ISTనితేశ్ తివారీ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం ‘రామాయణ’ కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది. ఇందులో రాముడిగా రణ్బీర్ కపూర్, రావణుడిగా కన్నడ స్టార్ యశ్ నటిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, తాజాగా యశ్ ఈ సినిమా గురించి కొన్ని క్రేజీ అప్డేట్స్ పంచుకున్నారు. మొదటి భాగంలో రాముడు, రావణుడు ఎదురుపడతారా? అసలు వీరిద్దరి మధ్య సీన్లు ఉన్నాయా? అనే విషయాలపై యశ్ క్లారిటీ ఇచ్చారు. ఆ విశేషాలు మీకోసం..
రాముడు - రావణుడు కలవరా?:
రణ్బీర్ కపూర్, తాను కలిసి ఇప్పటివరకు ఒక్క సీన్ కూడా షూట్ చేయలేదని యశ్ బాంబు పేల్చారు. ‘రామాయణ’ మొదటి భాగంలో రాముడు, రావణుడి మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. అంటే, కథ ప్రకారం తొలి భాగంలో రాముడి జీవితం, ఆయన వనవాసం.. మరోవైపు రావణుడి లంక సామ్రాజ్యం గురించి విడివిడిగా చూపించే అవకాశం ఉంది. వీరిద్దరి మధ్య అసలైన పోరాటం, కీలక ఘట్టాలు అన్నీ రెండో భాగంలోనే ఉంటాయని యశ్ మాటలను బట్టి అర్థమవుతోంది.
రణ్బీర్పై యశ్ ప్రశంసలు:
తెరపై కలిసి కనిపించకపోయినప్పటికీ, బయట మాత్రం రణ్బీర్తో తనకు మంచి అనుబంధం ఉందని యశ్ చెప్పుకొచ్చారు. రణ్బీర్ ఒక అద్భుతమైన నటుడని, సెట్స్లో తాము కలిసినప్పుడు ఎన్నో విషయాలు చర్చించుకున్నామని తెలిపారు. తమ ఇద్దరి ఆలోచనలు, పనితీరు ఒకేలా ఉండటం వల్ల సిల్వర్ స్క్రీన్ మీద కెమిస్ట్రీ పండించడం పెద్ద సమస్య కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక కేవలం నటుడిగానే కాకుండా, ఈ సినిమా నిర్మాణంలో కూడా యశ్ భాగస్వామిగా వ్యవహరిస్తుండటం విశేషం.
4000 కోట్ల బడ్జెట్.. భారీ విజువల్స్:
ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.4000 కోట్లు అని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. భారతీయ సినిమాలో ఇంతటి భారీ బడ్జెట్ తో వస్తున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. అయితే, ఇటీవల విడుదలైన కొన్ని గ్లింప్స్ చూసి కొందరు పెదవి విరిచినప్పటికీ, హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం మేకర్స్ ఎక్కడా తగ్గడం లేదట. అమెరికాలో జరిగిన కామికాన్ ఈవెంట్లో కూడా ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొందని చిత్ర యూనిట్ పేర్కొంది.
రిలీజ్ ఎప్పుడు ఉండొచ్చు?:
నిజానికి ఈ ఏడాది దీపావళికి మొదటి భాగాన్ని విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, విజువల్ ఎఫెక్ట్స్ పనులు భారీగా ఉండటంతో విడుదల వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రం, భారతీయ ఇతిహాసాన్ని సరికొత్త కోణంలో చూపించబోతోంది. రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా, వెండితెరపై రాముడు-రావణుల యుద్ధం చూడాలంటే మాత్రం మనం పార్ట్-2 వరకు వెయిట్ చేయాల్సిందే!
