వై ఆర్ ఎఫ్ స్పై దుకాణం మూసేస్తుందా?
దాదాపు 300 కోట్లు బడ్జెట్ తో నిర్మించారు. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో 'టైగర్ వర్సస్ పఠాన్' ఆలోచన విరమించుకుంది వైఆర్ ఎఫ్.
By: Tupaki Desk | 13 Jun 2025 9:15 AM ISTబాలీవుడ్ లో స్పై థ్రిల్లర్లకు పెట్టింది పేరు యశ్ రాజ్ ఫిలింస్. వైఆర్ ఎఫ్ 13 ఏళ్ల క్రితం స్పై వరల్డ్ లోకి ఎంటర్ అయింది. అప్పటి నుంచి స్పై థ్రిల్లర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించుకుంటూ వస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో తొలిసారి 'ఏక్ ధా టైగర్' నిర్మించింది. ఆ సినిమా మంచి విజయం సాధిం చింది. బాక్సాపీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అటుపై అదే సినిమాకు సీక్వెల్ గా అలీ అబ్బాస్ అదే హీరోతో 'టైగర్ జిందా హై' తెరకెక్కించి వైఆర్ ఎఫ్ కి మరో బ్లాక్ బాస్టర్ అందించాడు.
అటుపై హృతిక్ రోషన్- టైగర్ ష్రాప్ ప్రధాన పాత్రల్లో సిద్దార్ధ్ ఆనంద్ 'వార్ 'చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇది మంచి విజయం సాధించింది. అనంతరం సిద్దార్ద్ బాద్ షా షారుక్ ఖాన్ తో 'పఠాన్' తెరకెక్కించాడు. ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల వసూళ్లతో వైఆర్ ఎఫ్ ని స్పై చిత్రాల బ్రాండ్ అంబాసిడర్ గా మార్చేసింది. దీంతో అదే కాన్పిడెన్స్ తో సదరు సంస్థ సల్మాన్ ఖాన్ తో 'టైగర్ 3'ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
దాదాపు 300 కోట్లు బడ్జెట్ తో నిర్మించారు. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో 'టైగర్ వర్సస్ పఠాన్' ఆలోచన విరమించుకుంది వైఆర్ ఎఫ్. వాస్తవానికి ఈ చిత్రాన్ని 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించాలని భావించారు. కానీ ఒక్క ప్లాప్ ఆలోచనలు తారు మారు చేసింది. ప్రస్తుతం 'వార్' కి సీక్వెల్ గా వార్ 2 తెర కెక్కుతోంది. ఇందులో హృతిక్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. అలాగే మహిళా నటీమణులతో కూడా ఓస్పై చిత్రాన్ని తెరకెక్కిం చాలనే సంకల్పంతో అలియాభట్ ప్రధాన పాత్రలో 'ఆల్పా'ని తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు ఇదే ఏడాది రిలీజ్ కానున్నాయి. వీటి తర్వాత వైఆర్ ఎఫ్ స్పై యూనివర్శ్ నుంచి కొంత కాలం పాటు సినిమాలు చేయ కూడదని నిర్ణయించుకుందిట. స్పై యూనివర్శ్ లో కంటెంట్ అంతా ఒకేలా ఉండటంతో రోటీన్ అనే విమర్శలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే బ్రేక్ అనివార్యంగా భావించినట్లు కనిపిస్తుంది.
