మంచి మనసు చాటుకున్న మంచు విష్ణు
టాలీవుడ్ హీరో, నిర్మాత మంచు విష్ణు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్లోని పహల్గామ్ బాధితుడి కుటుంబాన్ని దత్తత తీసుకుని మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు.
By: Tupaki Desk | 4 May 2025 3:05 PMటాలీవుడ్ హీరో, నిర్మాత మంచు విష్ణు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్లోని పహల్గామ్ బాధితుడి కుటుంబాన్ని దత్తత తీసుకుని మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. నెల్లూరు జిల్లా కావలిలోని కుమ్మరి వీధికి చెందిన సోమిశెట్టి మధుసూధన్ రావు కొన్ని రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయాడు.
పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన 26 మంది టూరిస్టులలో మధుసూధన్ రావు కూడా ఒకరు. మంచు విష్ణు రీసెంట్ గా మధుసూధన్ భార్య కామాక్షి, అతని ఇద్దరు పిల్లల్ని కలిసి వారు కోల్పోయిన దానికి ప్రగాఢ సంతాపం తెలిపాడు. అంతేకాదు, ఈ కష్టకాలంలో మధుసూధన్ రావు ఫ్యామిలీకి అండగా ఉంటానని కూడా విష్ణు హామీ ఇచ్చాడు.
మధుసూధన్ రావు ఇద్దరి పిల్లల్ని దత్తత తీసుకుని వారి చదువులు, మిగిలిన అవసరాలను చూసుకోవాలని నిర్ణయించుకుని ఆ మేరకు వారి కుటుంబానికి విష్ణు హామీ ఇచ్చాడు. విష్ణు తీసుకున్న ఈ నిర్ణయానికి అతన్ని అందరూ మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో అభినందిస్తూ దేవుడు మీకు అంతా మంచే చేయాలని కోరుతూ పోస్టులు చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే విష్ణు త్వరలోనే కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జూన్ 27న కన్నప్ప రిలీజ్ కానుంది. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ సినిమాను మోహన్ బాబు నిర్మించగా, కన్నప్పలో అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు.