పూరి సర్.. ఇద్దరు హీరోయిన్స్ సెంటిమెంట్!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో డిజాస్టర్లను చవి చూశారు.
By: Tupaki Desk | 14 April 2025 12:54 PM ISTడాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో డిజాస్టర్లను చవి చూశారు. ప్రస్తుతం పూరితో సినిమా అంటే స్టార్ హీరోలు అవసరమా అనుకుంటున్నారు. డబుల్ ఇస్మార్ట్ తర్వాత పలువురు హీరోలతో టచ్లోకి వెళ్లేందుకు పూరి ప్రయత్నించారని, కానీ చాలా మంది హీరోలు ఆయనకు మొహం చాటారు అని గుసగుసలు వినిపించాయి. ఎట్టకేలకు విజయ్ సేతుపతితో సినిమాను పూరి కన్ఫర్మ్ చేశాడు. విభిన్న చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతి ఈ సినిమాను ఒప్పుకున్నాడంటే కచ్చితంగా కథలో విషయం ఉండే ఉంటుంది. పూరి జగన్నాధ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్తో పాటు, విజయ్ సేతుపతి మార్క్ వైవిధ్యం ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
పూరి జగన్నాధ్ చివరగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో హిట్ దక్కించుకున్నారు. రామ్ హీరోగా నటించిన ఆ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్లు హీరోయిన్స్గా నటించారు. ఇద్దరు హీరోయిన్స్ నటించిన ఆ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం విజయ్ సేతుపతి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్న కారణంగా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని పూరి అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కథానుసారంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారట. ఇప్పటికే టబు ను ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేశారు. విజయ్ సేతుపతికి జోడీగా టబు నటించబోతుందనే వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ సేతుపతికి జోడీగా టబు కనిపించబోవడం లేదు.
సినిమాలో ముఖ్య పాత్రను టబు పోషిస్తూ ఉండగా విజయ్ సేతుపతికి జోడీగా రాధిక ఆప్టే నటించబోతుంది. తెలుగులో రాధిక ఆప్టే పలు సినిమాల్లో నటించింది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ కే పరిమితం అయిన టబు సుదీర్ఘ కాలం తర్వాత తెలుగు సినిమాలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ సేతుపతికి జోడీగా రాధిక ఆప్టే దాదాపుగా కన్ఫర్మ్ అయిందనే వార్తలు వస్తున్నాయి. పూరి జగన్నాధ్ సినిమా అంటే హీరోయిన్స్కి మినిమం ప్రాముఖ్యగా ఉంటుంది. కనుక ఈ సినిమాలో కచ్చితంగా ఆమె పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. రాధిక ఆప్టే ఈ మధ్య కాలంలో సినిమాల కంటే వివాదాలతో ఎక్కువ వార్తల్లో నిలిచింది. ఈ సినిమాతో మరోసారి సౌత్లో రాధిక బిజీ అయ్యేనా చూడాలి.
పూరి జగన్నాధ్కు ఈ సినిమా విజయం అత్యంత కీలకం. పూర్వ వైభవం దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న పూరి జగన్నాధ్కు ఈ సినిమా హిట్ అయ్యేనా చూడాలి. ఇద్దరు హీరోయిన్స్తో ఒక విభిన్నమైన కాన్సెప్ట్తో ఈ సినిమాను ఆయన రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా గురించి ఇప్పటి వరకు ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి, కొత్తగా పుకార్లు పుట్టుకు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు మరోసారి పూరి జగన్నాధ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టబు, రాధిక తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో వారికి కూడా ఈ సినిమా విజయం కీలకం.
