ఊర్వశి పోస్టర్ వివాదం... ఇదెక్కడి విడ్డూరం మావ!
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈమధ్య కాలంలో డాకు మహారాజ్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది.
By: Tupaki Desk | 26 April 2025 5:36 PM ISTబాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈమధ్య కాలంలో డాకు మహారాజ్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. ముఖ్యంగా ఈమె డాకు మహారాజ్ సినిమా తర్వాత టాలీవుడ్లో తన డిమాండ్ ఫుల్గా పెరిగింది. అక్కడి ఫిల్మ్ మేకర్స్ చాలా మంది ఆఫర్లు ఇస్తామంటూ వెంట పడుతున్నారు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. డాకు మహారాజ్ సినిమా విజయంలో కీలక పాత్ర తనదే అన్నట్లుగా ఊర్వశి రౌతేలా తెగ హడావిడి చేస్తుంది. బాలీవుడ్తో పోల్చితే ఈ అమ్మడికి సౌత్లో ఎక్కువ పారితోషికం ఆఫర్ చేస్తున్నారట. దాంతో ముందు ముందు ఈమె తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలని ఆశ పడుతోంది. అందుకు తగ్గట్లుగానే మరికొన్ని సినిమాల్లో ప్రత్యేక పాటలను చేయాలని భావిస్తోంది. హీరోయిన్గా ఆఫర్లు వస్తాయా అని ఎదురు చూస్తోంది.
తాజాగా డాకు మహారాజ్ సినిమా పోస్టర్ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. సినిమా థియేట్రికల్ రిలీజ్ సమయంలో ఊర్వశి రౌతేలా ఫోటోను పోస్టర్లో వేయడం జరిగింది. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ సమయంలో మాత్రం నెట్ఫ్లిక్స్ వారు సినిమా పోస్టర్లో ఊర్వశి రౌతేలా లేకుండానే పోస్టర్ను షేర్ చేశారు. ఆ విషయమై ఊర్వశి రౌతేలా స్పందించింది. తన ఫోటో లేదు అనే విషయాన్ని గుర్తించిన తన అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. నెట్ఫ్లిక్స్ వారు తమ తప్పును గుర్తించి వెంటనే క్షమాపణలు చెప్పారని, ఆ తర్వాత వారి నుంచి వచ్చిన పోస్టర్లో తన ఫోటోను పెట్టారు అంటూ చెప్పుకొచ్చింది. క్షమాపణలు చెప్పారంటూ ఊర్వశి రౌతేలా చెప్పిన విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఊర్వశి రౌతేలా ఈ మధ్య కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు తరచు చేస్తూ మీమ్ మెటీరియల్ అవుతోంది. తన పేరు మీద గుడి ఉందని, అక్కడికి వెళ్లిన సమయంలో గుడికి తప్పకుండా వెళ్లమంటూ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ గుడికి సంబంధించిన పూజారులు తీవ్రంగా స్పందించడంతో తన వ్యాఖ్యలను వక్రీకరించారు అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఊర్వశి మీడియా ముందుకు వచ్చినప్పుడు, ఇంటర్వ్యూల సమయంలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఆ తర్వాత నాలుక కరుచుకోవడం అనేది కామన్ అయింది. ప్రతి సారి కూడా ఇలాగే వక్రీకరించారు అంటే కుదరదు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
డాకు మహారాజ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. వారిలో ఊర్వశి రౌతేలా పాత్ర పరిమితమైనదే. పోస్టర్లో ఆమె ఫోటోను పెట్టాల్సిన అవసరం ఉండదు. అయినా కూడా రిలీజ్ సమయంలో పోస్టర్ పై ఆమె ఫోటోను పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఆమె ఫోటోను నెట్ఫ్లిక్స్ వారు లేకుండా స్ట్రీమింగ్కు సంబంధించిన విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆ విషయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. తన అభిమానులు ఫీల్ అయ్యారని కూడా తెగ హడావిడి చేస్తుంది. ఊర్వశి రౌతేలా తీరును చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇదెక్కడి విడ్డూరం అంటూ ఊర్వశి రౌతేలా తీరును సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఊర్వశి రౌతేలా డాకు మహారాజ్ సక్సెస్ క్రెడిట్ మొత్తం కావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉందని కొందరు ఈ విషయం గురించి ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈమె తీరు ఇలాగే ఉంటే ముందు ముందు ఆఫర్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్ లో కాస్త తగ్గి ఉంటేనే బెటర్ అనే విషయం ఆమెకు ఎప్పటికి తెలుస్తుందో చూడాలి.
