ఆంధ్రా కింగ్ నువ్వే అనగానే టెన్షన్ పడ్డాను: ఉపేంద్ర
రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం `ఆంధ్రా కింగ్ తాలూకా`. ఈనెల 28న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.
By: Sivaji Kontham | 29 Nov 2025 6:40 AM ISTరామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం `ఆంధ్రా కింగ్ తాలూకా`. ఈనెల 28న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శాండల్వుడ్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఈరోజు హైదరాబాద్లో నిర్మాతలు విజయోత్సవ సభను నిర్వహించారు.
సక్సెస్ మీట్ లో ఉపేంద్ర మాట్లాడుతూ.. తనపై తెలుగు ప్రజల అపారమైన ప్రేమాభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపేంద్ర మాట్లాడుతూ -``ఈ ఆఫర్ రాగానే థ్రిల్లయ్యాను. ఎందుకంటే ఇది బలమైన భావోద్వేగాలతో నిండి ఉంది. నాకు ఉన్న ఏకైక ఆందోళన టైటిల్ గురించి. నేను ఆంధ్రా కింగ్ అని మేకర్స్ అన్నారు. దానికి టెన్షన్ పడ్డాను. నేను `ఆంధ్రా కింగ్` ఎలా కాగలను? కానీ నేను వచ్చినప్పుడల్లా ఇక్కడి ప్రజలు నన్ను ముక్తకంఠంతో స్వాగతించారు, అందుకే నేను కింగ్లా ఫీలయ్యాను. తెలుగు ప్రేక్షకులు పెద్ద హృదయం కలిగి ఉన్నారు. గత 25 సంవత్సరాలుగా నాకు ఈ హృదయపూర్వక స్వాగతం లభిస్తున్నందుకు ఆనందంగా ఉన్నాను`` అన్నారు.
ఇలాంటి అవకాశం కల్పించిన మైత్రి మూవీ మేకర్స్ కు నేను నిజంగా కృతజ్ఞుడను అని ఉపేంద్ర అన్నారు. నా సహ నటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. నా అభిమానులు సాగర్, మహాలక్ష్మి (రామ్-భాగ్యశ్రీ) లకు ఆయన బ్లెస్సింగ్స్ అందించారు. ప్రస్తుతం రామ్ , భాగ్యశ్రీ అమెరికాలో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.. కానీ నేను ఇక్కడే ఉన్నాను అని కూడా తెలిపారు. నిజానికి నేను స్టార్ ని కదా నన్ను యుఎస్ కి పంపాలి అంటూ సరదాగా జోక్ చేసారు ఉప్పీ.
