మూడు రాత్రుళ్లు నిద్ర లేకుండా చేసిన బాత్రూమ్!
'ధురంధర్' కథా గమనంలో ప్రతీ పాత్ర ఎంతో హైలైట్ అయింది. అందులో ఏ పాత్ర తీసేయడానికి లేదు.
By: Srikanth Kontham | 26 March 2026 10:44 PM IST`ధురంధర్` కథా గమనంలో ప్రతీ పాత్ర ఎంతో హైలైట్ అయింది. అందులో ఏ పాత్ర తీసేయడానికి లేదు. హీరో రోల్ కు ధీటుగా కీలక పాత్రలు అంతే హైలైట్ అయ్యాయి. చిన్న చిన్న రోల్స్ సైతం అంతే ఆకట్టుకున్నాయి.సినిమాలో ప్రతి సన్నివేశం ఒక ఎత్తు అయితే నటుడు ఉదయ్బీర్ సంధు , రణవీర్ సింగ్ మధ్య వచ్చే బాత్రూమ్ సీన్ మరో ఎత్తు. ఈ సన్నివేశం తనను ఎంతగా ప్రభావితం చేసిందంటే? షూటింగ్ పూర్తయిన తర్వాత వరుసగా మూడు రాత్రులు నిద్రపోలేకపోయానని ఉదయ్బీర్ వెల్లడించడం ఇంట్రెస్టింగ్.
ఈ చిత్రంలో పిండా అనే డ్రగ్ డీలర్ పాత్రలో ఉదయ్బీర్ సంధు అద్భుతమైన నటనను కనబరిచాడు. ముఖ్యంగా బాత్రూమ్ సెట్టింగ్లో రణవీర్ సింగ్తో జరిగే ఆ తీవ్రమైన సంభాషణ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆ సన్నివేశంలో ఉండే ఎమోషన్, పాత్రల మధ్య ఉండే ఉత్కంఠ తనను మానసికంగా ఎంతో కుదిపేసిందని, ఆ పాత్ర నుండి బయటకు రావడానికి చాలా సమయం పట్టిందని ఉదయ్ ఆవేదనతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సీన్ను అత్యంత సహజంగా తెరకెక్కించారు. చిత్రీకరణ ముగిసిన వెంటనే ఆదిత్య ధర్ స్వయంగా ఉదయ్బీర్ దగ్గరకు వెళ్లారు.
`నువ్వు ఎంత గొప్ప పని చేశావో నీకు ఇప్పుడు అర్థం కాదు. సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది` అని మెచ్చుకున్నారట. అన్నట్టుగానే థియేటర్లలో ఆ సీన్ వస్తున్నప్పుడు ప్రేక్షకులు పిన్డ్రాప్ సైలెన్స్తో ఆ ఉద్వేగాన్ని అనుభవిస్తున్నారు. ఈ సినిమాలో ఉదయ్బీర్ పలికించిన `ఘర్ దీ యాద్ నహీ ఆయీ తుజే, జస్సీ?` (నీకు ఇంటి గుర్తు రాలేదా జస్సీ?) అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక పక్క రణవీర్ సింగ్ గూఢచారిగా తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతుంటే? మరోపక్క ఉదయ్బీర్ తన స్నేహితుడిగా అడిగే ఈ ప్రశ్న ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తోంది.
ఈ ఒక్క సీన్తో ఉదయ్బీర్ ఓవర్నైట్ స్టార్గా మారిపోయారు. `ధురందర్ 2` విజయంలో కేవలం యాక్షన్ మాత్రమే కాదు. ఇలాంటి బలమైన భావోద్వేగ సన్నివేశాలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఒక నటుడు తన పాత్ర కోసం ఎంతటి మానసిక సంఘర్షణకు లోనవుతాడో ఉదయ్బీర్ సంధు నిరూపించారు. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు వసూలు చేసిన ఈ చిత్రంలో ఉదయ్బీర్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం లాంగ్ రన్ లో 2000 కోట్ల వసూళ్లతో దంగల్ రికార్డు తిరగరాస్తుందని భారీ అంచనాలున్నాయి.
