Begin typing your search above and press return to search.

టాలీవుడ్ 2024: మూడు నెలల్లో ఎన్ని హిట్టు.. ఎన్ని ఫట్టు?

అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తే, భారీ అంచనాలతో వచ్చిన పెద్ద హీరోలు ఆశించిన విజయాలు అందుకోలేకపోయాయి.

By:  Tupaki Desk   |   2 April 2024 3:30 PM GMT
టాలీవుడ్ 2024: మూడు నెలల్లో ఎన్ని హిట్టు.. ఎన్ని ఫట్టు?
X

చూస్తుండగానే ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయాయి. 2024లో ఇప్పటి వరకూ అనేక సినిమాలు రిలీజ్ అయ్యాయి. టాలీవుడ్ క్వార్టర్లీ బాక్సాఫీస్ రిపోర్ట్ ను పరిశీలిస్తే, హిట్లు కంటే ఫ్లాపులే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తే, భారీ అంచనాలతో వచ్చిన పెద్ద హీరోలు ఆశించిన విజయాలు అందుకోలేకపోయాయి.

జనవరి మొదటి వారంలో అర డజను చిన్న సినిమాలు వచ్చాయి కానీ, ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. సంక్రాంతికి ఈసారి 'గుంటూరు కారం', 'హనుమాన్', 'సైంధవ్', 'నా సామి రంగ' లాంటి నాలుగు క్రేజీ చిత్రాలు పోటీ పడ్డాయి. వాటిలో తేజ సజ్జ సినిమా ఎవరూ ఊహించని విధంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. 150 థియేటర్లలో 50 రోజులు ప్రదర్శించబడి సంక్రాంతి విన్నర్ అనిపించుకుంది.

మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' సినిమా టాక్ తో సంబంధం లేకుండా రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ చిత్రానికి థియేటర్స్ లో కంటే ఓటీటీలో మంచి స్పందన లభించింది. వెంకటేశ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'సైంధవ్' బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన 'నా సామి రంగ' సినిమా రూ. 50 కోట్ల వరకూ కలెక్షన్లు రాబట్టి, హిట్ స్టేటస్ అందుకుంది. అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించి, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.

సంక్రాంతి తర్వాత జనవరిలో విడుదలైన చిన్న చిత్రాలు ఏవీ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఫిబ్రవరి ప్రారంభంలో వచ్చిన 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్' సినిమా హిట్టు కొట్టింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నేపధ్యంలో మహి వి. రాఘవ తీసిన 'యాత్ర 2' సినిమా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. రవితేజ 'ఈగల్' మూవీతో మరో డిజాస్టర్‌ని అందుకున్నారు. రజినీకాంత్ నటించిన డబ్బింగ్ మూవీ 'లాల్ సలాం' ను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు.

ఫిబ్రవరి రెండో వారంలో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీసిన 'రాజధాని ఫైల్స్' సినిమాను జనాలు పట్టించుకోలేదు. యువ హీరో సందీప్ కిషన్ మాత్రం 'ఊరు పేరు భైరవకోన' సినిమాతో చాలా కాలం తర్వాత మంచి సూపర్ హిట్ అందుకున్నారు. అయితే రవితేజ నిర్మాణంలో వైవా హర్ష హీరోగా నటించిన 'సుందరం మాస్టర్'.. మరో కమెడియన్ అభినవ్ గోమటం చేసిన 'మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా'.. 'సిద్ధార్థ్ రాయ్' లాంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. మార్చి ఫస్ట్ వీక్ లో మెగా హీరో వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్‌'తో భారీ పరాజయం మూటగట్టుకున్నారు.

అదే రోజు వచ్చిన భూతద్దం భాస్కర్ నారాయణ'.. వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ ప్లే చేసిన 'చారీ 111' మూవీస్ కూడా ఫ్లాప్ అయ్యాయి. ఏపీ రాజకీయాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' మూవీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. మహా శివరాత్రి సందర్భంగా వచ్చిన విశ్వక్ సేన్ 'గామి' సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటుగా మంచి కలెక్షన్స్ అందుకుంది. గోపీచంద్ నటించిన 'భీమా' సినిమా నిరాశ పరిచింది. అదే సమయంలో రాజమౌళి కుమారుడు రిలీజ్ చేసిన మలయాళ డబ్బింగ్ మూవీ 'ప్రేమలు' బాగా ఆడింది.

మార్చి సెకండ్ వీక్ లో విడుదలైన రజాకార్‌, షరతులు వర్తిస్తాయి, తంత్ర, వెయ్ దరువెయ్ లాంటి సినిమాల పట్ల ఆడియెన్స్ ఆసక్తి కనబరచలేదు. 'ఓం భీమ్ బుష్' సినిమాతో థియేటర్లలో నవ్వులు పూయించిన శ్రీవిష్ణు, మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం' మంచి ప్రయత్నం అనిపించుకుంది కానీ, కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. నెలాఖరున 'టిల్లు స్క్వేర్‌' మూవీతో సిద్ధు జొన్నలగడ్డ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.78 కోట్ల వసూళ్లు రాబట్టి మార్చి నెలను ఘనంగా ముగించింది.