టాలీవుడ్లో సీక్వెల్స్ హవా - 5000 కోట్ల భారీ బిజినెస్!
టాలీవుడ్ ఇప్పుడు సరికొత్త రికార్డుల దిశగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు సీక్వెల్స్ అంటే కేవలం ఒక సినిమా విజయవంతమైతే దానికి పొడిగింపుగా మాత్రమే చూసేవారు.
By: Srikanth Kontham | 7 Jun 2026 8:00 AM ISTటాలీవుడ్ ఇప్పుడు సరికొత్త రికార్డుల దిశగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు సీక్వెల్స్ అంటే కేవలం ఒక సినిమా విజయవంతమైతే దానికి పొడిగింపుగా మాత్రమే చూసేవారు. కానీ నేడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కథ రాసుకునేప్పుడే దానిని ఒకటి కంటే ఎక్కువ భాగాలుగా.. పెద్ద సినిమాటిక్ యూనివర్స్గా మలిచేందుకు దర్శక,రచయితలు ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే మూడేళ్లలో టాలీవుడ్ నుంచి దాదాపు అరడజనుకు పైగా భారీ సీక్వెల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. ట్రేడ్ వర్గాల తాజా అంచనాల ప్రకారం కేవలం ఈ సీక్వెల్స్ మార్కెట్ విలువ .. బిజినెస్ సామర్థ్యం దాదాపు 5,000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
ఈ భారీ సీక్వెల్స్ రేసులో అందరికంటే ముందు వరుసలో నిలుస్తున్నారు పాన్-ఇండియా స్టార్ ప్రభాస్. ఇతడు నటించిన విజువల్ వండర్ `కల్కి 2898 AD` మొదటి భాగం సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా `కల్కి 2` షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో పాటు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రిలీజ్ `సలార్` కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా సీక్వెల్ `సలార్ 2: శౌర్యాంగ పర్వం` చిత్రాన్ని 2027లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్ ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసిన వెంటనే 2028 సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి పక్కా షెడ్యూల్ను సిద్ధం చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ‘ఓజి’. ముంబై అండర్వరల్డ్ బ్యాక్డ్రాప్లో సుజీత్ ఎంతో స్టైలిష్గా తెరకెక్కించిన గ్యాంగ్స్టర్ డ్రామా మొదటి భాగానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసారు. పవన్ కళ్యాణ్ రాజకీయ, వ్యక్తిగత డేట్స్పై ఆధారపడి `ఓజి 2` కథను మరింత వైలెంట్గా, గ్లోబల్ స్టాండర్డ్స్లో సుజీత్ సిద్ధం చేస్తున్నారు.
అన్ని అనుకూలిస్తే 2027 ద్వితీయార్థంలో ఈ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉంది. గ్లోబల్ గ్యాంగ్స్టర్ లుక్లో పవన్ను నెక్స్ట్ లెవెల్లో చూపించేలా ఈ స్క్రిప్ట్ ఉండబోతోంది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ`హను-మాన్` చిత్రంతో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు. `ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్` ను స్థాపిం చారు. ఇందులో భాగంగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `జై హనుమాన్` చిత్రం ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లింది. మొదటి భాగం సృష్టించిన మైలురాయిని అధిగమించేలా మరింత భారీ విజువల్ ఎఫెక్ట్స్తో బలమైన పురాణ కథాంశంతో సీక్వెల్ను ప్రశాంత్ వర్మ మలుస్తున్నారు.
భక్తి, కమర్షియల్ ఎలిమెంట్స్ కలయికగా రాబోతున్న చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. `మిరాయ్` కి సీక్వెల్ గా `మిరాయ్ 2` కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. తేజ సజ్జా- కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో రాబోతున్న చిత్రమిది. ఇదే హీరోతో ప్రశాంత్ వర్మ పర్యవేక్షణలో `జాంబీ రెడ్డి 2` కూడా రెడీ అవుతోంది. ఈ భారీ లైనప్ ఆధారంగా టాలీవుడ్ లో 5000 కోట్లకు పైగానే బిజినెస్ జరుగుతుందనే చర్చ ఫిలిం సర్కిల్స్ లో జరుగుతోంది.
