చిరుతో మాట్లాడాక ఎగ్జిబిటర్లు హ్యాపీ: దిల్ రాజు
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో థియేటర్ల రంగంలోని క్రైసిస్ గురించి సమీక్షా సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 26 May 2026 8:57 AM ISTప్రస్తుతం తెలుగు చిత్రసీమలో థియేటర్ల రంగంలోని క్రైసిస్ గురించి సమీక్షా సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో సినీపెద్దలంతా సింగిల్ థియేటర్ల సమస్యలపై చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో మూతపడుతున్న సింగిల్ థియేటర్ల గురించి తెలుసుకుని చిరంజీవి ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా సమస్యకు ఒక పరిష్కారాన్ని వెతికేందుకు నియమించిన కమిటీ ఇచ్చే రిపోర్ట్ వచ్చే వరకూ వేచి ఉండాలని ఎగ్జిబిటర్లను కోరారు.
సమావేశం అనంతరం దిల్ రాజు మీడియా ఎదుట మాట్లాడుతూ.. కమిటీ నుండి గత వారం క్రితం సమాచారాన్ని సేకరించిన చిరంజీవి గారు ఎగ్జిబిటర్ల సమస్యలను పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఈ విషయానికి సంబంధించిన అధికారిక వివరాలను చాంబర్ నుండి రేపు లేదా ఎల్లుండి అధికారికంగా వెల్లడించనున్నారు.
ఎగ్జిబిటర్ల సమస్యలన్నింటినీ అర్థం చేసుకున్న చిరంజీవి అందరితో మాట్లాడి రేపు లేదా ఎల్లుండి కల్లా ఈ సమస్యను కమిటీకి అప్పజెప్పి, ఆ కమిటీ ద్వారా వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వారికి మాట ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఎగ్జిబిటర్లందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని దిల్ రాజు తెలిపారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి ని కలిసినప్పుడు ఆయన నుండి చాలా సానుకూల స్పందన లభించిందని, దాదాపు గంటకు పైగా (1 గంట 10 నిమిషాలు) కూర్చొని థియేటర్ల సంక్షోభం, సింగిల్ స్క్రీన్స్ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ఆయనకు వివరించినట్లు ఎగ్జిబిటర్ సెక్టార్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సమస్యలపై స్పందించిన ఆయన కమిటీ సభ్యులను పిలిపించి మాట్లాడతానని, అలాగే ఎగ్జిబిటర్లతో కూడా మరోసారి సమావేశమై త్వరలోనే ఒక తుది నిర్ణయాన్ని తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.
