దీపావళి సినిమాలతో ఆ ఇబ్బంది లేదు..!
నేడు మిత్ర మండలి సినిమాతో దీపావళి సీజన్ ప్రారంభం అయింది. వరుసగా మూడు రోజుల పాటు సినిమాలు విడుదల కాబోతున్నాయి.
By: Ramesh Palla | 16 Oct 2025 11:18 AM ISTటాలీవుడ్లో సినిమాల జాతర కొనసాగుతూనే ఉంది. వరుసగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతున్నా, సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఏదో నమ్మకంతో సినిమాలను చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఎప్పటిలాగే పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అయ్యాయి, ఎప్పటిలాగే కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రతి పండుగకు టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు రావడం అనేది కామన్ విషయం. ఈ దీపావళికి కూడా పెద్ద ఎత్తున సినిమాలు వస్తున్నాయి. ప్రధానంగా నాలుగు సినిమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మూడు తెలుగు సినిమాలు విడుదల కానుండగా, ఒక తమిళ డబ్బింగ్ మూవీ ఈ దీపావళికి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నేడు మిత్ర మండలి సినిమాతో దీపావళి సీజన్ ప్రారంభం అయింది. వరుసగా మూడు రోజుల పాటు సినిమాలు విడుదల కాబోతున్నాయి.
మిత్రమండలి సినిమా విడుదల
దీపావళికి విడుదల కాబోతున్న నాలుగు సినిమాలు కూడా సాధారణ టికెట్ల రేట్లతోనే చూసే అవకాశంను నిర్మాతలు కల్పిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలకు కూడా టికెట్ల రేట్లను భారీగా పెంచేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయి, దాంతో నిర్మాతలు టికెట్ల రేట్లు పెంచేసుకుంటున్నారు. కానీ ఈసారి మాత్రం దీపావళికి సినిమాను చూడాలి అనుకునే వారు పెద్దగా ఇబ్బంది పడనక్కర్లేదు. జేబుకు చిల్లు పెట్టించుకోనక్కర్లేదు. నాలుగు సినిమాలు సైతం మినిమం రేట్లతోనే రాబోతున్నాయి. టికెట్ల రేట్ల పెంపు వల్ల జరిగే నష్టం ఇప్పటికే చాలా మంది పెద్ద నిర్మాతలకు అర్థం అయింది. అందుకే ఇకపై పెద్ద హీరోల సినిమాలకు కూడా టికెట్ల రేట్లను పెంచేందుకు నిర్మాతలు భయపడే పరిస్థితి ఉంది. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా టికెట్ల రేట్ల కారణంగా వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు.
టాలీవుడ్ సినిమాల టికెట్ల రేట్లు పెంపు..
తెలుగు ప్రేక్షకుల ముందుకు నేడు మిత్రమండలి సినిమా వచ్చింది. ఈ సినిమా అల్లు వారి కాంపౌండ్ నుంచి రావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. టికెట్ల రేట్లు సాధారణంగానే ఉండటం వల్ల ఇప్పటికే బుకింగ్ బాగానే నమోదు అయినట్లు తెలుస్తోంది. సినిమాకు కాస్త పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి, కామెడీ బాగుందని టాక్ వస్తే ఖచ్చితంగా తక్కువ రేట్లకే టికెట్లు వస్తున్నాయి కనుక ఖచ్చితంగా మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. దీపావళి కానుకగా తెలుసు కదా సినిమా రానుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పబ్లిసిటీతోనే అదరగొట్టేశారు. మ్యాటర్ ఉన్న సినిమా అని, మంచి సినిమా అనే అభిప్రాయం అందరిలోనూ కలిగించారు. దానికి తోడు టికెట్ల రేట్ల పెంపు లేకపోవడంతో తెలుసు కదా కి మంచి ఓపెనింగ్స్ నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ సినిమా రిలీజ్..
ఇక ప్రదీప్ రంగనాథన్ తెలుగులో లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆయన హీరోగా అనగానే డ్యూడ్ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. పైగా సినిమాను తెలుగులో బాగానే ప్రమోట్ చేశారు. టికెట్ల రేట్లు ఈ సినిమాకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక చివరగా కిరణ్ అబ్బవరం యొక్క కె ర్యాంప్ సినిమా సైతం దీపావళికి వస్తుంది. ఈ సినిమాను సైతం జేబుకు చిల్లు పడకుండానే చూసుకునే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు తీవ్రమైన పోటీ మధ్య విడుదల కాబోతున్నాయి. కనుక ప్రేక్షకులు ఈ సినిమాల్లో ఏ సినిమాలకు తమ ఆధరణ చూపిస్తారు అనేది చూడాలి. బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా ఆడబోతుంది అనేది మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.
