'ధృవ' ప్రభాస్ చేసి ఉంటే ఎలా ఉండేది?
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో `తని ఒరువన్` (ధృవ) కథ గురించి దర్శకుడు మోహన్ రాజా ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.
By: Sivaji Kontham | 22 Jan 2026 4:00 AM ISTజయం రవి -అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన `తని ఒరువన్` కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. అదే కథతో రామ్ చరణ్ కథానాయకుడిగా టాలీవుడ్ లో మోహన్ రాజా దర్శకత్వంలోనే రీమేక్ చేయగా, ఇక్కడ కూడా సినిమా బంపర్ హిట్ కొట్టింది. చరణ్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ మేకోవర్ ప్రధానంగా చర్చల్లోకొచ్చింది.
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో `తని ఒరువన్` (ధృవ) కథ గురించి దర్శకుడు మోహన్ రాజా ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. నిజానికి ఈ పవర్ ఫుల్ పోలీస్ స్టోరీని (మిత్రన్ IPS పాత్రను) మొదట యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కోసమే రాసుకున్నారట. దర్శకరచయిత మోహన్ రాజా స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు.
మోహన్ రాజా ఈ కథను ప్రభాస్కు వినిపించినప్పుడు ఆ సమయంలో ఒక పూర్తి లవ్ స్టోరీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. దానివల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత మోహన్ రాజా తన తమ్ముడు జయం రవితో ఈ సినిమా తీశారు. 2015లో విడుదలైన ఈ చిత్రం కోలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఏడాది గ్యాప్ తర్వాత తెలుగులో రామ్ చరణ్ కథానాయకుడిగా ధృవ టైటిల్తో రీమేక్ చేయగా ఇక్కడా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రీమేక్ లో కూడా అరవిందస్వామి విలన్ పాత్రలో నటించడం మరో హైలైట్.
ప్రస్తుతం మోహన్ రాజా ఈ సినిమా సీక్వెల్పై కసరత్తు చేస్తున్నారు. జనవరి 2026 నాటి సమాచారం ప్రకారం.. ఈ సీక్వెల్లో కూడా జయం రవి - నయనతార ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. కోలీవుడ్ లో పలు భారీ చిత్రాల మధ్య `తని ఒరువన్ 2` కూడా ఈ ఏడాదే పట్టాలెక్కే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ సినిమా కోసం అత్యంత భారీ బడ్జెట్ అవసరం అయినందున చాలా ఆలస్యమైందని మోహన్ రాజా ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తని ఒరువన్ ఫ్యాన్స్ సీక్వెల్ మూవీ రాక కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. సీక్వెల్ ని కూడా రామ్ చరణ్ కథానాయకుడిగా మోహన్ రాజా స్వయంగా రీమేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
