Begin typing your search above and press return to search.

తండేల్.. పర్ఫెక్ట్ బిజినెస్ అయ్యేలా..

నేటివిటీ టచ్ ఉన్న కథలకి ఈ మధ్య పాన్ ఇండియా స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో తండేల్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 March 2024 7:30 AM GMT
తండేల్.. పర్ఫెక్ట్ బిజినెస్ అయ్యేలా..
X

నాగచైతన్య, సాయి పల్లవి జోడీగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ తండేల్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం నాన్ స్టాప్ గా కొనసాగుతోంది. భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ పై బన్నివాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితో ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ మూవీ కథ ఉంటుందని ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ తో స్పష్టం అయ్యింది. మూవీలో హీరో, హీరోయిన్ ఉత్తరాంద్ర స్లాంగ్ లోనే మాట్లాడనున్నారని తెలుస్తోంది.

మత్స్యకార వర్గానికి చెందిన ఫిషర్ మెన్ గా నాగ చైతన్య ఈ చిత్రంలో నటిస్తున్నాడు. సముద్రంపై వేటకి వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ జైల్లో చాలా మంది ఉత్తరాంద్ర మత్స్యకారులు బందీలు అయ్యారు. అలా బందీ అయిన వారిలో ఒకరిగా చైతన్య కనిపిస్తున్నాడు. అతను తన దేశ భక్తిని ఎలా చూపించుకున్నాడు. అలాగే మత్స్యకారుల తరుపున అతను చేసిన పోరాటం.. సాయి పల్లవితో ప్రేమాయణం వంటి అంశాలు తండేల్ మూవీలో ప్రధాన కథాంశంగా ఉండబోతున్నాయంట.

ఈ సినిమాపై గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్, బన్నీ వాస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే నాగ చైతన్య సినిమా కోసం ఎలాంటి లిమిట్స్ లేకుండా గట్టిగానే ఖర్చు చేస్తున్నారు. నేటివిటీ టచ్ ఉన్న కథలకి ఈ మధ్య పాన్ ఇండియా స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో తండేల్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన యూఎస్ రైట్స్ 6.5 కోట్లకి అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

అలాగే ఆంధ్రా తెలంగాణాలో కూడా రిలీజ్ రైట్స్ కోసం గట్టిపోటీ ఉందంట. కచ్చితంగా సాలిడ్ బిజినెస్ డీల్స్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. నైజాం ఏరియాలో నాగ చైతన్య కెరియర్ లోనే అత్యధిక బిజినెస్ తండేల్ పై జరిగే అవకాశం ఉందంట. చందూ మొండేటి కార్తికేయ 2తో నార్త్ ఇండియాలో సూపర్ హిట్ కొట్టాడు.

దీంతో తండేల్ కి అక్కడి బయ్యర్ల నుంచి హిందీ రైట్స్ కోసం భారీగా ఆఫర్స్ వస్తున్నాయంట. ఇక తమిళ్, మలయాళం వైపు సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది. తెలుగు సినిమాల కంటెంట్ క్లిక్కయితే కన్నడలో కూడా డిమాండ్ ఉంటుంది. ఈ విధంగా తండెల్ పర్ఫెక్ట్ పాన్ ఇండియా రేంజ్ లో మంచి బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది.

సాయి పల్లవికి కూడా ఇండియన్ వైడ్ గా మంచి ఇమేజ్ ఉంది. ఇప్పటికే అమీర్ ఖాన్ తనయుడు హీరోగా తెరకెక్కుతోన్న సినిమాతో సాయి పల్లవి బాలీవుడ్ లో అడుగుపెట్టింది. రామాయణం మూవీ సిరీస్ లో సీత పాత్రకి ఎంపికైంది. దీంతో ఆమె ఇమేజ్ కూడా తండేల్ బిజినెస్ ని మరింత పెంచే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.