బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న తమన్నా కల ఫలిస్తుందా?
భారతీయ సినీ పరిశ్రమలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్థానం సుదీర్ఘమైనది. టాలీవుడ్-కోలీవుడ్- బాలీవుడ్ లో ఈ బ్యూటీ చాలా దూరం ప్రయాణించింది.
By: Sivaji Kontham | 10 July 2026 9:45 AM ISTభారతీయ సినీ పరిశ్రమలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్థానం సుదీర్ఘమైనది. టాలీవుడ్-కోలీవుడ్- బాలీవుడ్ లో ఈ బ్యూటీ చాలా దూరం ప్రయాణించింది. అయితే ఎస్.ఎస్. రాజమౌళి దృశ్యకావ్యం `బాహుబలి` చిత్రంలో అవంతికగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కినా ఆ తర్వాత కెరీర్లో ఆశించిన పెద్ద బ్లాక్ బస్టర్ ఏదీ సాధింలేదు. ఇలాంటి కీలక తరుణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ `ది వివాన్ - ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్` విడుదలకు సిద్ధమవుతుండగా దీని ఫలితంపై బిగ్ హోప్స్ తో ఉంది తమన్నా. సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 25 సెప్టెంబర్026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్ అంచనాలను పెంచుతోంది.
ఇటీవలి కాలంలో సౌత్ లో అగ్రహీరోల సరసన అవకాశాలు తగ్గడంతో తమన్నా తన బాలీవుడ్ జర్నీపై భారీ ఆశలనే పెట్టుకుంది. ఇప్పటికే పలు సినిమాలు... విభిన్నమైన వెబ్ సిరీస్లతో హిందీ ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. `ది వివాన్` చిత్రంతో బాలీవుడ్లో గట్టి బ్రేక్ సాధించి తన రేంజ్ను పెంచుకోవాలని చూస్తోంది. జానపద కథల ఆధారంగా ఒక సరికొత్త ఒరిజినల్ సినిమాటిక్ యూనివర్స్గా తెరకెక్కుతున్న ఈ ఫోక్లోర్ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం తమన్నా కెరీర్కు ఏ మేరకు ప్లస్ అవుతుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఈ సినిమా హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద సరైన హిట్లు లేక తడబడుతున్నాడు. అతడు నటించిన ఇటీవలి చిత్రాలు కేవలం యావరేజ్ వసూళ్లతోనే సరిపెట్టుకున్నాయి. ఇలాంటి కీలక సమయంలో సిద్ధార్థ్ మల్హోత్రా సైతం ఈ భారీ విజువల్ వండర్ పైనే పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నాడు. భారతీయ పురాణాలు, సరికొత్త చిహ్నాలతో దీపక్ మిశ్రా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సిద్ధార్థ్కు.. అలాగే అతని సరసన నటిస్తున్న తమన్నాకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోందనే చర్చ బాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
కేవలం `ది వివాన్` మాత్రమే కాకుండా తమన్నా ఖాతాలో ఎన్నో వైవిధ్యమైన ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. జానపద ఫాంటసీ చిత్రం `ది వివాన్` తర్వాత బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ హారర్ ఫ్రాంచైజీ `రాగిణి ఎంఎంఎస్ 3` లో ఎన్నడూ లేనంతగా బోల్డ్ పాత్రలో నటిస్తోంది. దీనితో పాటు భారతీయ సినిమా దిగ్గజం వి. శాంతారామ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్లోనూ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే ప్రముఖ దర్శకుడు జగన్ శక్తి తెరకెక్కిస్తున్న మరో రెండు బాలీవుడ్ చిత్రాలలోనూ బిజీగా గడుపుతోంది. ఇటు హిందీ ప్రాజెక్టులతో పాటు అటు సౌత్లోనూ తన పట్టును నిలుపుకునేందుకు తమన్నా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్లో స్టార్ హీరో విశాల్ సరసన `పురుషన్` అనే భారీ చిత్రంలో నటిస్తూ తమిళ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది.
`ది వివాన్` కనుక బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తే.. కచ్చితంగా ఇది `బాహుబలి` తర్వాత తమన్నా కెరీర్ను మళ్లీ టాప్ గేర్లోకి తీసుకెళ్లే ఛాన్సుంది. ది వివాన్ కోసం ఏకంగా 150 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేయడంతో ట్రేడ్ వర్గాలతో పాటు, అందరి కళ్లు ఈ సినిమాపైనే ఉన్నాయి. బాలాజీ మోషన్ పిక్చర్స్- టీవీఎఫ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
