10 కోట్ల అపార్ట్ మెంట్ టబు చేతిలో!
బాలీవుడ్ సెలబ్రిటీలంతా రియల్ ఎస్టేట్ రంగంలో ఏ రేంజ్ లో పెట్టుబడులు పెడుతున్నారో చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 19 April 2026 9:44 AM ISTబాలీవుడ్ సెలబ్రిటీలంతా రియల్ ఎస్టేట్ రంగంలో ఏ రేంజ్ లో పెట్టుబడులు పెడుతున్నారో చెప్పాల్సిన పనిలేదు. అందుకుంటోన్న పారితోషికాలతో విలాసవంతమైన భవనాలు, స్థలాలు కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాలలో ఒకటిగా పేరుగాంచిన వెర్సోవా ఏరియాలో సీనియర్ నటి టబు ఓ కొత్త అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. ఈ అపార్ట్మెంట్ విలువ 10.40 కోట్లుగా ఉంటుందని అంచనా. వెర్సోవాలోని ప్రతిష్టాత్మకమైన హై-రైజ్ బిల్డింగ్లో ఈ ప్రాపర్టీ ఉంది.
ముంబై లాంటి నగరాల్లో స్థిరాస్తి ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో టబు చేసిన భారీ డీల్ చర్చనీయాంశంగా మారింది. సముద్ర తీరానికి సమీపంలో ఉండటమే కాదు. నగరం మొత్తం అందంగా కనిపించేలా ఈ ఇల్లు ఉండటం దీని ప్రత్యేకత. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం టబు 60 లక్షల స్టాంప్ డ్యూటీని ప్రభుత్వానికి చెల్లించినట్లు తెలుస్తోంది. సాధారణంగా సెలబ్రిటీలు జుహు లేదా బాంద్రా ప్రాంతాల్లో నివసించడానికి మొగ్గు చూపుతారు. కానీ టబు వెర్సోవాను ఎంచుకోవడం వెనుక ఓ కారణం ఉంది. ఆ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంటుందిట.
తనకు బాగా కావాల్సిన బాలీవుడ్ ప్రముఖులు కూడా అదే ప్రాంతంలో ఉన్నారుట. ఈనేపథ్యంలో టబు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. టబు ఇప్పటికే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది. ఈ కొత్త ఇల్లు ఆమె అభిరుచికి తగ్గట్టుగా అన్ని ఆధునిక వసతులతో సిద్దంగా ఉంది . జిమ్, స్విమ్మింగ్ పూల్ , అత్యున్నత భద్రతా ప్రమాణాలు ఈ భవనంలో ఉన్నాయి. ఇక టబు సినిమాల విషయానికి వస్తే? ప్రస్తుతం టబు కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ను ఎంతో విజయవంతంగా కొనసాగిస్తుంది. వరుస విజయాలు టబు రేంజ్ ను అంతకంతకు రెట్టింపు చేస్తున్నాయి.
బాలీవుడ్ చిత్రాలతో పాటు అంతర్జాతీయ ప్రాజెక్టులను ఒడిసి పట్టుకుంటుంది. టాలీవుడ్ లో కూడా టబుకు మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ పాత్రల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. బాలీవుడ్ తరహాలో బోల్డ్ పాత్రలకు ఒకే చెప్పడం లేదు. టాలీవుడ్ లో తనకున్న ఇమేజ్ ఆధారంగానే కొత్త ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తుంది. డీసెంట్ పాత్రలతో మాత్రమే తనదైన ముద్ర వేస్తుంది. ఇటీవలే టబు నటించిన హిందీ చిత్రం `బూత్ బంగ్లా` భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. కానీ వాటిని అందుకోవడంలో విఫలమైంది. 120 కోట్ల బడ్జెట్ సినిమా 25 కోట్లను మాత్రమే రాబట్టింది. అలాగే విజయ్ సేతు పతి కథానాయకుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తోన్న `స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్` లో నటిస్తోంది. పూరితో టబు పని చేయడం కూడా ఇదే తొలిసారి. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా విజయం పూరికి అత్యంత కీలకమైంది.
