మిస్టిక్ వరల్డ్ లోకి మరో ఇద్దరు స్టార్లు!
చిన్న సినిమా టాలీవుడ్ లో సక్సెస్ చూసిందంటే? అందుకు కారణం కొన్ని రకాల సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ జానర్ చిత్రాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
By: Srikanth Kontham | 6 Feb 2026 11:00 PM ISTచిన్న సినిమా టాలీవుడ్ లో సక్సెస్ చూసిందంటే? అందుకు కారణం కొన్ని రకాల సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ జానర్ చిత్రాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం అగ్ర హీరోలకే సక్సెస్ పరిమితమైన రోజుల్లో డిఫరెంట్ జానర్లో సినిమాలు చేసి కొంతమంది చిన్న హీరోలు సక్సెస్ అయ్యారు. వీరంతా కేవలం కంటెంట్ తో మాత్రమే జనాల్ని థియేటర్ కు రప్పించారు. తమని నమ్మి కాదని...సినిమాలో కంటంట్ ని నమ్మి రండని వాగ్దానం చేసి జనాల్ని థియేటర్ కు తీసుకురాగలిగారు. అనుకున్నట్లుగానే సక్సెస్ అయ్యారు. ప్లాప్ ల్లో ఉన్న హీరోలను సైతం వైవిథ్యమైన కంటెంట్ విజయంతో బయటకు తేగలిగింది.
ప్రత్యేకించి మిస్టికల్ థ్రిల్లర్లు, సస్పెన్స్ థ్రిల్లర్లదే కొంత కాలంగా జమానా? అనడంలో ఎలాంటి సందేహం లేదు. `విరూపాక్ష` తో సాయితేజ్, `క` తో కిరణ్ అబ్బవరం, అంతకు ముందు `కార్తికేయ` తో నిఖిల్ అలా బయట పడిన స్టార్లే. ఇటీవలే రిలీజ్ అయిన `శంబాల`తో ఆది సాయికుమార్ కూడా మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఎంతో కాలంగా విజయం కోసం పోరాటం చేస్తోన్న ఆదిలో శంబాల విజయం వెయ్యి ఏనుగుల బలాన్ని నింపింది. ఇప్పుడా హీరో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. `శంబాల`కు కొనసాగింపుగా `శంబాల 2` కూడా చేస్తున్నాడు.
పై విజయాల స్పూర్తితోనే నాగచైతన్య `వృషకర్మ` అనే మిస్టికల్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. ఓ గుహ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో సాహసకుడి పాత్రలో చైతన్య కనిపిస్తాడు. అలాగే శ్రీ విష్ణు హీరోగా `మృత్యుంజయ` అనే సినిమా తెరకెక్కుతోంది. ఇదీ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కు చెందిన కథ. హుసేన్ షా కిరణ్ ప్రతిష్టాత్మకంగా తెర కెక్కిస్తున్నారు. ఇంకా నిఖిల్ నటిస్తోన్న `స్వయంభూ`లోనూ కొన్ని మిస్టికల్ అంశాలున్నాయి. నిఖిల్ అప్ కమింగ్ చిత్రం `కార్తికేయ3` కూడా మిస్టికల్ అంశాలతోనూ రూపొందనుంది. ఈసారి ఏకంగా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా చందు మొండేటి 3డీలో ప్లాప్ చేస్తున్నారు.
తాజాగా ఈ వరుసలో మరో ఇద్దరు యంగ్ హీరోలు రామ్, వరుణ్ తేజ్ కూడా చేరుతున్నారు. ఇటీవలే `ఆంధ్రాకింగ్` తో ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్ ఈ సినిమాతో సాధించింది లేదు. సినిమా హిట్ అయిన లాభాలు రాలేదు. దీంతో రామ్ తక్కు వ బడ్జెట్ లో ఓ థ్రిల్లర్ చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్టోరీ లాక్ చేసాడని సమా చారం. దర్శకుడి పేరు మాత్రం బయటకు రాలేదు. అలాగే వరుణ్ తేజ్ `కమిటీ కుర్రాళ్లు` దర్శకుడు యదు వంశీతో ఓ మిస్టికల్ థ్రిల్లర్ సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు వినిపిస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా `కొరియన్ కనకరాజ్` తెరెక్కుతోన్న సంగతి తెలిసిందే.
