క్లియరెన్స్ రాకుండా కరుప్పు సినిమా స్క్రీనింగ్
గురువారం రిలీజ్ కావాల్సిన సూర్య సినిమా కరుప్పు (తెలుగులో వీరభద్రుడు)కు ఊహించని అడ్డంకులు ఎదురై షోలు పడని సంగతి తెలిసిందే.
By: Garuda Media | 15 May 2026 11:00 AM ISTగురువారం రిలీజ్ కావాల్సిన సూర్య సినిమా కరుప్పు (తెలుగులో వీరభద్రుడు)కు ఊహించని అడ్డంకులు ఎదురై షోలు పడని సంగతి తెలిసిందే. ముందు మార్నింగ్ షోలు మాత్రమే రద్దు అన్నారు. తర్వాత మ్యాట్నీలకు కూడా బొమ్మ పడలేదు. సాయంత్రం నుంచి షోలు పడొచ్చని దర్శకుడు ఆర్జే బాలాజీ ఆశాభావం వ్యక్తం చేశాడు కానీ.. అదీ జరగలేదు. శుక్రవారం అయినా సినిమా రిలీజవుతుందో లేదో తెలియట్లేదు. అటు తమిళంలోనే కాక ఇటు తెలుగులోనూ సినిమా రిలీజ్ ఆగిపోయింది. నిర్మాత ఎస్.ఆర్.ప్రభు గత చిత్రాలు దారుణమైన నష్టాలు మిగల్చడంతో ఫైనాన్షియర్లకు సెటిల్ చేయకపోవడం వల్లే ఇప్పుడు సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. రూ.50 కోట్లకు పైగానే సెటిల్ చేయాల్సి ఉన్నట్లు చెబుతున్నారు. నిర్మాత ఈ వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నంలో ఉండగానే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
కరుప్పు సినిమా తమిళ వెర్షన్ను ఉత్తరాదిన కొన్ని చోట్ల స్క్రీనింగ్ చేసేశారు. క్యూబ్ ద్వారా సినిమా రిలీజైంది. ఇలా ఏదైనా సినిమా రిలీజ్ చివరి నిమిషంలో ఆగిందంటే.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా స్క్రీనింగ్ చేయడానికి వీలుండదు. కానీ కరుప్పు విషయంలో కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్లో ఏమో.. నార్త్ ఇండియాలో కొన్ని చోట్ల తమిళ వెర్షన్ షోలను స్క్రీనింగ్ చేసేశారు. ఈ విషయం నిర్మాత దృష్టికి వచ్చి స్క్రీనింగ్ మధ్యలో ఆపించినట్లు తెలుస్తోంది. దీని మీద ప్రభుతో పాటు కొందరు తమిళ సినీ ప్రముఖులు కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. క్యూబ్ వాళ్లు పొరపాటుగా స్క్రీనింగ్ చేసేశారని.. ఈ విషయం తెలిసి షోలు ఆపించామని.. జరిగిన తప్పుకు పరిహారం చెల్లిస్తామని క్యూబ్ సంస్థ హామీ ఇచ్చిందని తెలిపారు. ఐతే నార్త్ ఇండియాలో ఈ సినిమా స్క్రీనింగ్ జరిగిన చోట్ల నుంచి సినిమా పైరసీ అయి ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కరుప్పు సినిమా లీక్ అంటూ సోషల్ మీడియాలో కొంత హడావుడి కూడా జరిగింది. కానీ కొన్ని థియేటర్ విజువల్స్ తప్పితే.. సినిమా లీక్ అయిన సంకేతాలేమీ కనిపించడం లేదు.
