రూ.130 కోట్లకు సూర్య బ్రదర్స్ హామీ?
కొన్నేళ్ల ముందు వరకు తమిళ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తిల ఫాలోయింగ్, మార్కెట్ వేరే స్థాయిలో ఉండేవి. నిలకడగా హిట్లు కొట్టేవాళ్లు.
By: Garuda Media | 16 May 2026 8:00 PM ISTకొన్నేళ్ల ముందు వరకు తమిళ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తిల ఫాలోయింగ్, మార్కెట్ వేరే స్థాయిలో ఉండేవి. నిలకడగా హిట్లు కొట్టేవాళ్లు. మార్కెట్ సినిమా సినిమాకు విస్తరిస్తుండేది. తెలుగులో కూడా ఇద్దరికీ తిరుగులేని మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులు ఇద్దరి మార్కెట్నూ బాగా దెబ్బ తీశాయి. ముఖ్యంగా సూర్య పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారింది. సక్సెస్ లేకపోవడానికి తోడు.. సూర్య, కార్తిల సినిమాలు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని విడుదల విషయంలో ఇబ్బంది పడుతుండడం అభిమానులకు బాధ కలిగిస్తోంది. కొన్ని నెలల కిందట కార్తి సినిమా వా వాత్తియార్కు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. డిసెంబరులో అనుకున్న రిలీజ్ ఆగిపోయింది. చివరికి జనవరిలో అతి కష్టం మీద సినిమాను రిలీజ్ చేశారు. ఆ చిత్రాన్ని నిర్మించిన సూర్య, కార్తిల కజిన్ జ్ఞానవేల్ రాజాకు ఫైనాన్షియల్ ఇష్యూస్లో నిండా కూరుకుపోయి ఉన్నాడు.
సూర్య హీరోగా తీసిన కంగువ సినిమా దారుణమైన నష్టాలు మిగిల్చడం.. వేరే సినిమాల నష్టాలు కూడా పేరుకుపోవడంతో వా వాత్తియార్ టైంలో జ్ఞానవేల్ ఫైనాన్స్, డిస్ట్రిబ్యూషన్ వివాదాల్లో చిక్కుకుపోయాడు. వా వాత్తియార్ టైంలో సూర్య, కార్తి సోదరులు.. తమ కజిన్ కోసం రూ.100 కోట్ల మొత్తానికి హామీగా నిలిచినట్లు సమాచారం. తమ సినిమాలతోనే అతను నష్టపోవడంతో అతడికి అన్నదమ్ములు అండగా నిలిచే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో అతడితో సినిమాలు తీసి.. ఆ నష్టాలను భర్తీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు సూర్య మరో నిర్మాతకు అండగా నిలవాల్సిన పరిస్థితి వచ్చింది.
తనతో కరుప్పు సినిమా తీసిన ఎస్.ఆర్.ప్రభు సైతం జ్ఞానవేల్ రాజా తరహాలోనే నష్టాలు ఎదుర్కొని వివాదంలో చిక్కుకున్నాడు. దీంతో కరుప్పు విడుదల చివరి నిమిషంలో ఆగిపోయింది. ఆ చిత్రం ఒక రోజు ఆలస్యంగా రిలీజైందన్నా అది సూర్య జోక్యంతోనే అని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి రూ.30 కోట్ల మొత్తానికి సూర్య హామీగా నిలిచాడట. ఆ డబ్బులు సొంతంగా చెల్లిస్తాడా.. నిర్మాత నుంచి ఇప్పిస్తాడా అన్నది తర్వాత కానీ.. ప్రస్తుతానికి ఆ మొత్తానికి అతను ఈ మొత్తానికి హామీగా నిలిచి సినిమా రిలీజ్కు క్లియరెన్స్ ఇప్పించాడట. మొత్తంగా సూర్య, కార్తి బ్రదర్స్ ఇద్దరూ కలిసి రూ.130 కోట్ల మొత్తానికి హామీగా ఉండడం తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
