సింగిల్తో డబుల్ కాబోతున్న హీరో..!
గత సంవత్సరం 'ఓం భీమ్ బుష్', 'స్వాగ్' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీవిష్ణు తాజాగా 'సింగిల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
By: Tupaki Desk | 20 May 2025 11:29 AM ISTగత సంవత్సరం 'ఓం భీమ్ బుష్', 'స్వాగ్' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీవిష్ణు తాజాగా 'సింగిల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చిన్న సినిమాగా విడుదలైన సింగిల్ సినిమాకు విభిన్నమైన ప్రమోషన్స్ చేయడం ద్వారా మంచి బజ్ క్రియేట్ అయింది. సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. అంతే కాకుండా పాజిటివ్ పబ్లిక్ టాక్ దక్కడంతో వీకెండ్లో మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. సైలెంట్గా సింగిల్ సినిమా భారీ వసూళ్ల దిశగా దూసుకు పోతుంది. పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో పాటు, ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో వినోదాన్ని అందించలేక పోయాయి. అందుకే సింగిల్కి మంచి స్పందన దక్కింది.
కెరీర్ ఆరంభం నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన సినిమాలను చేస్తూ వస్తున్నాడు. గత ఏడాదిలో ఆయన నుంచి వచ్చిన స్వాగ్ సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. అంతకు ముందు వచ్చిన ఓం భీమ్ బుష్ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ రెండు సినిమాలు కమర్షియల్గా నిరాశ పరచినా కంటెంట్ పరంగా ఎప్పటికీ చెప్పుకోదగ్గ సినిమాలుగా నిలిచాయి. అంతే కాకుండా ఆ రెండు సినిమాలతో పాటు ముందు ముందు శ్రీవిష్ణు నుంచి రాబోతున్న సినిమాలు కూడా అంతే విభిన్నంగా ఉండబోతున్నాయి. తన గత చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా విభిన్నమైన కంటెంట్తో సింగిల్ సినిమాతో వచ్చి కమర్షియల్ హిట్ దక్కించుకున్నాడు.
ఇప్పటి వరకు సీరియస్ పాత్రలు, కామెడీ పాత్రలు చేస్తూ మెప్పిస్తూ వచ్చిన శ్రీవిష్ణు సింగిల్ సినిమాలో తన కామెడీ యాంగిల్ను పూర్తి స్థాయిలో చూపించాడు. వెన్నెల కిషోర్తో కలిసి శ్రీవిష్ణు పండించిన కామెడీకి మంచి స్పందన దక్కింది. సింగిల్ సినిమా ఫలితంతో శ్రీవిష్ణు క్రేజ్ డబుల్ అయింది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ అనుసారం సింగిల్ సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత శ్రీవిష్ణు మార్కెట్ భారీగా పెరిగిందని, అందుకు తగ్గట్లుగానే తన పారితోషికంను పెంచాడట. శ్రీవిష్ణు తన పారితోషికంను దాదాపుగా రెట్టింపు చేశాడు అంటూ మీడియా సర్కిల్స్లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే శ్రీ విష్ణు తన కొత్త సినిమాకు రెట్టింపు పారితోషికం అందుకోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తుంది.
పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రీ విష్ణు కో స్టార్గా నటిస్తూ, హీరోగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతూ వచ్చాడు. ఎన్నో విభిన్నమైన కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన శ్రీవిష్ణు మరిన్ని మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశంతో కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాడు. ఈ ఏడాదిలో విష్ణు నుంచి మరో సినిమా విడుదల ఉండే అవకాశాలు ఉన్నాయి. మృతుంజయ్, విష్ణు విన్యాసం సినిమాలతో పాటు విష్ణు20 వ సినిమా సైతం లైన్లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ విష్ణు నుంచి కొత్త సినిమాలు మంచి కంటెంట్తో రాబోతున్నాయి. సింగిల్ ఇచ్చిన క్రేజ్తో పారితోషికం డబుల్ అయినట్లుగానే విష్ణు మార్కెట్ కూడా డబుల్ అయినట్లే అని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.