క్రేజీ హీరోయిన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ!
ఇదే తరహాలో హీరోయిన్ స్నేహ ప్రమాదానికి గురైందట. తమిళ, తెలుగు భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటించి క్రేజీ కథానాయికగా గుర్తింపుని సొంతం చేసుకుంది.
By: Ravindar Gorantla | 3 March 2026 9:00 AM ISTఫిల్మ్ స్టార్స్ జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన దళపతి, రోజా, `బొంబాయి` వంటి సినిమాల్లో నటించిన హీరోగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న హీరో అరవింద్ స్వామి. కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలోనే యాక్సిడెంట్కు గురై నడవలేని స్థాయికి వెళ్లిపోయారు. సినిమాలకు చాలా ఏళ్లు దూరమయ్యారు. ఆ తరువాత జరిగిన మెరాకిల్ వల్ల మళ్లీ నడవడం మొదలు పెట్టి కొత్త జర్నీని స్టార్ట్ చేయడం తెలిసిందే.
ఇదే తరహాలో హీరోయిన్ స్నేహ ప్రమాదానికి గురైందట. తమిళ, తెలుగు భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటించి క్రేజీ కథానాయికగా గుర్తింపుని సొంతం చేసుకుంది. అయితే యాక్సిడెంట్ ఆమె కెరీర్ని ఓ కుదుపు కుదిపేసి తలకిందులు చేసిందట. కెరీర్ పీక్స్లో ఉండగానే యాక్సిడెంట్కి గురైన స్నేహ మంచానికే పరిమితమైంది. ఎనిమిది నెలలు గడిస్తే కానీ నడవలేవని డాక్టర్లు చెప్పారట. ఆ టైమ్లో డైరెక్టర్ కరు పళనియప్పన్ సినిమా ఛాన్స్ ఇచ్చి మీరు చేయగలరని చెప్పారట. ఆ సమయంలో తనలో మానసిక స్థైర్యాన్ని కలిగించింది ఓ డైరెక్టర్ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
`నేను సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సమయంలో నాకు ఒక ప్రమాదం జరిగింది. నా చేతులు, కాళ్లు, వీపుకు బలమైన గాయాలయ్యాయి. దాంతో మంచానికే పరిమితం అయిపోయాను. నేను లేచి నడవడానికి ఎనిమిది నెలలకు మించి సమయం పడుతుందని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఆ సమయంలో దర్శకుడు కరు పళనియప్పన్ `పార్తీబన్ కనవు` స్టోరీతో నా దగ్గరకు వచ్చారు. నా అనారోగ్యం కారణంగా నేను ఇక్కడ మంచంలో పడి ఉన్నాను. ఈ స్థితిలో ఆయన నన్ను సినిమా కోసం పిలుస్తున్నారా? అని ఆశ్చర్యపోయాను.
అయితే ఆయన నాలో స్ఫూర్తిని నింపారు. `నువ్వు ఖచ్చితంగా కోలుకుని మళ్లీ నడుస్తావు`అని చెప్పి నాకు ధైర్యం చెప్పారు. ఇక నేను నడవలేనేమో అనుకున్న నాలో ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కలిగించారు. ఆయనిచ్చిన ధైర్యం, ప్రోత్సాహం నేను త్వరగా కోలుకునేలా చేసింది. 2003లో విడుదలైన ఈ మూవీలో శ్రీకాంత్ హీరోగా నటించాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ అయి స్నేహకు హీరోయిన్గా మంచి పేరు తెచ్చి పెట్టింది. కమల్హాసన్తో `వసూల్ రాజా ఎంబీబిఎస్`లో నటించే అవకాశాన్ని తెచ్చి పెట్టింది.
ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో సుందర్.సి రూపొందిస్తున్న `ముకుతి అమ్మన్ 2 (ముక్కుపుడక అమ్మవారు)లో నటిస్తోంది. ఇషారి కె. గణేష్, ఖుష్బూ సుందర్తో కలిసి విఘ్నేష్ శివన్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. వంద కోట్ల బడ్జెట్తో అత్యంత భారీ స్థాయిలో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ని ప్రకటిస్తారు.
