Begin typing your search above and press return to search.

శ‌ర్వానంద్ కు జోడీగా మాజీ మిస్ ఇండియా బ్యూటీ?

ఒకప్పుడు కంటెంట్‌ బేస్డ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వా, ఇప్పుడు కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ వైపు అడుగులు వేస్తూ వరుస విజయాలతో కొత్త దూకుడు చూపిస్తున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   14 May 2026 7:00 PM IST
శ‌ర్వానంద్ కు జోడీగా మాజీ మిస్ ఇండియా బ్యూటీ?
X

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా మిడ్‌రేంజ్ హీరోల్లో అత్యంత స్ట్రాంగ్ కంబ్యాక్ అందుకున్న హీరోగా శ‌ర్వానంద్ పేరు బలంగా వినిపిస్తోంది. ఒకప్పుడు కంటెంట్‌ బేస్డ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వా, ఇప్పుడు కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ వైపు అడుగులు వేస్తూ వరుస విజయాలతో కొత్త దూకుడు చూపిస్తున్నారు. ముఖ్యంగా నారీ నారీ నడుమ మురారి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయన మార్కెట్ గణనీయంగా పెరగడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే సమయంలో ఆయన త‌ర్వాతి సినిమాల ఎంపిక కూడా ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా భోగి షూటింగ్‌లో బిజీగా ఉన్న శర్వానంద్, మరోవైపు డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల‌తో చేయబోయే కొత్త ప్రాజెక్ట్‌తో మరింత ఆసక్తిని పెంచుతున్నారు.

ఒకప్పుడు వరుస బ్లాక్‌బస్టర్లతో టాలీవుడ్‌లో కామెడీకి కొత్త ట్రెండ్ సెట్ చేసిన శ్రీను వైట్ల, ఈసారి పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్‌తో తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయన స్టైల్ హిలేరియస్ కామెడీకి టైమ్ ట్రావెల్ ఎలిమెంట్ జతకావడం ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రత్యేక చర్చకు కారణమైంది. ఇప్పటివరకు టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన తెలుగు సినిమాలు ఎక్కువగా సీరియస్ ట్రీట్‌మెంట్‌తో సాగగా, ఈసారి పూర్తి వినోదాత్మక కోణంలో కథను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా శర్వానంద్ కామిక్ టైమింగ్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఈ కథకు పెద్ద ప్లస్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారట. తొలుత ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాలనుకున్నప్పటికీ, తర్వాత ఈ బాధ్యతను నిర్మాత అనిల్ సుంక‌ర స్వీకరించడం విశేషం. ఇప్పటికే నారీ నారీ నడుమ మురారితో సక్సెస్ అందుకున్న శర్వా-అనిల్ సుంకర కాంబో మరోసారి రిపీట్ అవుతుండటంతో బిజినెస్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై పాజిటివ్ బజ్ కనిపిస్తోంది.

ఇక ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎంపిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ డిస్కషన్‌గా మారింది. మొదట స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించినా, ఇప్పుడు మిస్ ఇండియా రన్నరప్ మాన‌స వార‌ణాసి పేరు బలంగా వినిపిస్తోంది. ఇటీవల కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మానస, వరుస ఆఫర్లతో టాలీవుడ్‌లో ఫాస్ట్‌గా ఎదుగుతోంది. ముఖ్యంగా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ట్రెడిషనల్ లుక్‌తో పాటు మోడ్రన్ అప్పీల్ ఉండటం ఈ ప్రాజెక్ట్‌కు ప్లస్ అవుతుందని టాక్. ఒకవేళ ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే శర్వానంద్‌కు పూర్తిగా ఫ్రెష్ పెయిరింగ్ దొరికినట్లే అవుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉండగా, జులై 2026 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు. వచ్చే సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని చూస్తున్నారని సమాచారం. కామెడీ, టైమ్ ట్రావెల్, ఫ్రెష్ కాస్టింగ్ కలయికతో వస్తున్న ఈ సినిమా శర్వానంద్ కెరీర్‌లో మరో కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.