Begin typing your search above and press return to search.

సంజ‌య్ లీలా భ‌న్సాలీ భారీ సాహ‌సం?

సోమ్‌నాథ్ పుణ్య‌క్షేత్రంపై గ‌జ‌ని మ‌హ్మ‌ద్ క్రూర‌, హింసాత్మ‌క‌ దండ‌యాత్ర చేసింది 1026 జ‌న‌వ‌రిలోనే.

By:  Ravindar Gorantla   |   22 Feb 2026 8:45 AM IST
సంజ‌య్ లీలా భ‌న్సాలీ భారీ సాహ‌సం?
X

వెండితెర‌పై ఛారిత్రాత్మ‌క చిత్రాల‌ని ఆవిష్క‌రించ‌డంలో ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ. భారీ సెట్‌ల‌ని రూపొందించి ఆనాటి కాలాన్ని మ‌న క‌ళ్ల‌ముందుకు తీసుకొచ్చి ఆ ఫీల్‌ని క‌లిగించ‌డంతో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఛారిత్ర‌క నేప‌థ్య‌మున్న సినిమాల‌ని అంతే అందంగా అంతే గ్రాండీయ‌ర్‌తో తెర‌పైకి తీసుకురావాడంలో ఆయ‌న‌ని మించి డైరెక్ట‌ర్లు లేరు. ఇది ఆయ‌న చేసిన దేవ‌దాస్‌, రామ్‌లీలా, భాజీరావు మ‌స్తానీ, ప‌ద్మావ‌త్‌, గంగుబాయి క‌తియావాడీ, హీరామండీ చిత్రాల్లో క‌నిపించిన గ్రాండియ‌రే ఇందుకు నిద‌ర్శ‌నం.

ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్‌గా `ల‌వ్ అండ్ వార్‌` మూవీని చేస్తున్న సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్రొడ్యూస‌ర్‌గా మ‌రో ఛారిత్రాత్మ‌క సినిమాకు శ్రీ‌కారం చుడుతున్నారు. అదే `జై సోమ్‌నాథ్‌`. గ‌జ‌నీ దండ‌యాత్ర నేప‌థ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. భార‌త‌దేశంపై దండ‌యాత్ర చేసిన గ‌జ‌నీ మ‌హ్మ‌ద్‌కు తీవ్ర రాజ్య కాంక్ష‌, ధ‌న‌కాంక్ష ఉండేవి. ప‌ర్షియా, మ‌ధ్య ఆసియా, అఫ్గ‌నిస్థాన్‌ల‌ను క‌లిపి సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాల‌ని భావించాడు. అల‌నాటి భ‌ర‌త‌దేశ ఐశ్వ‌ర్యం, సంప‌ద‌ను విని త‌న ల‌క్ష్య సాధ‌న‌కు కావాల్సిన ఆర్థిక వ‌న‌రుల‌ని అక్క‌డి నుంచి కొల్ల‌గొట్టాని నిశ్చ‌యించుకున్నాడు.

కీస్తు శ‌కం 1000- 1027 మ‌ధ్య సుమారు 17 సార్లు దండ‌యాత్ర చేసి అప‌రా ధ‌న‌రాశుల‌ని దోచుకెళ్లాడు. గ‌జ‌ని దండ‌యాత్ర అత్యంత ఐశ్వ‌ర్య‌వంత‌మైన సోమ్‌నాథ్ దేవాల‌యం ల‌క్ష్యంగా సాగింది. క‌థియావాడ్ పాల‌కుడైన సోలంకి రాజు భీమ‌దేవుడిని ఓడించి సోమ్‌నాథ్ ఆల‌యాన్ని కొల్ల‌గొట్టి ధ్వంసం చేశాడు. ఆల‌యం నుంచి వేల కిలోల బంగారాన్ని దోచుకెళ్లాడు. స్వాంత‌త్య్రం వ‌చ్చిన త‌రువాత అప్ప‌టి హోమ్ మంత్రి స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ఈ ఆల‌య నిర్మాణానికి ఆదేశాలిచ్చారు.

సోమ్‌నాథ్ పుణ్య‌క్షేత్రంపై గ‌జ‌ని మ‌హ్మ‌ద్ క్రూర‌, హింసాత్మ‌క‌ దండ‌యాత్ర చేసింది 1026 జ‌న‌వ‌రిలోనే. దాడి జ‌రిగిన ప్ర‌తీసారి ఆల‌య ర‌క్ష‌ణ‌లో భాగంగా వేల మంది ప్ర‌జ‌లు అడ్డుగా నిలిచి త‌మ ప్ర‌ణాల‌ని ప‌ణంగా పెట్టారు. ఈ పోరులో మొత్తం యాభై వేల మంది ప్రాణ త్యాగం చేశారు. ఈ యుద్దంలో హ‌మీర్ గోపాల్ అనే రాజ‌కుమారుడు శ‌త్రు సేన‌ల‌పై విరుచుప‌డి మ‌ట్టిక‌రిపించాడు. కానీ చివ‌ర‌కు ప్రాణాలు కోల్పోయాడు. ఈ స‌మ‌యంలో శ‌త్రు సైన్యంపై ప‌టాన్ ప్ర‌భువైన ప‌ర‌మ‌దేవ్ విరుచుకు ప‌డ్డాడ‌ట‌. దాంతో అత‌న్ని త‌ట్టుకోలేక గ‌జ‌నీ సైన్యం పారిపోయార‌ట‌. భార‌తీయ చ‌రిత్ర‌లో మ‌ర్చిపోలేని దండ‌యాత్ర‌ల్లో ఒక‌టిగా నిలిచిన సోమ‌నాథ్ ఆల‌యం నేప‌థ్యంలో ఇప్పుడు సినిమా రాబోతోంది.

సంజ‌య్ లీలా భ‌న్సాలీ నిర్మాణంలో `మంగ‌ల్ పాండే` ఫేమ్ కేత‌న్ మెహ‌తా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. గ‌తంలో సంజ‌య్ లీలా భ‌న్సాలీ రూపొందించిన `భాజీరావు మ‌స్తానీ`, ప‌ద్మావ‌త్‌` చిత్రాల‌పై వివాదాలు చెల‌రేగిన విష‌యం తెలిసిందే. గ‌జ‌ని మ‌హ్మ‌ద్ క్రూర‌మైన దండ‌యాత్ర నేప‌థ్యంలో రూపొంద‌నున్న `జై సోమ్‌నాథ్‌` ఎలాంటి వివాదాల‌కు తేర‌లేపుతుందో వేచి చూడాల్సిందే.