నిర్మాత 13,000 కోట్ల ఆస్తి పంపకాలు ఎలా?
ఒక అంచనా ప్రకారం సంజయ్ కపూర్ నికర ఆస్తుల విలువ 13000 కోట్లు. అయితే ఈ ఆస్తి ఎవరికి దక్కుతుంది? అతడు వేర్వేరు కాలాల్లో ముగ్గురిని పెళ్లాడాడు.
By: Tupaki Desk | 16 Jun 2025 5:00 AM ISTకరిష్మా కపూర్ మాజీ భర్త, సినీ నిర్మాత, బిజినెస్ మేన్ సంజయ్ కపూర్ ఇంగ్లాండ్లో పోలో మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తేనెటీగ గొంతులోకి దూరి కుట్టడంతో శ్వాసనాళం మూసుకుపోయి, ఊపిరాడక చివరికి గుండెపోటుతో మరణించాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఒక దుర్మరణం. ఆయనకు 53 ఏళ్లు.
ఒక అంచనా ప్రకారం సంజయ్ కపూర్ నికర ఆస్తుల విలువ 13000 కోట్లు. అయితే ఈ ఆస్తి ఎవరికి దక్కుతుంది? అతడు వేర్వేరు కాలాల్లో ముగ్గురిని పెళ్లాడాడు. వారందరికీ పిల్లలు ఉన్నారు. అందువల్ల ఆస్తి పంపకాలు ఎలా చేయాలి? ఏ ఆస్తి ఎవరికి ఎంత దక్కుతుంది? అనేదానిపై సందిగ్ధత నెలకొంది. ఇక సంజయ్ కపూర్ పిల్లల్లో ఎవరూ కంపెనీ బాధ్యతలు చేపట్టేంత వయసుకు ఎదగలేదు. సంజయ్ సోదరీమణులు అతడి కంపెనీలను నిర్వహించే అవకాశం ఉందని సోనాకామ్ కంపెనీ ప్రకటించింది.
కరిష్మా, సంజయ్ 2014లో పరస్పర అంగీకారం ద్వారా విడాకులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పిల్లల సంరక్షణ వారి ఆస్తుల విషయంలో వారి మధ్య అవగాహనలు ఉన్నాయి. ఏఎన్ ఐ కథనం (2016) ప్రకారం... సంజయ్ కపూర్ తన పిల్లల భవిష్యత్తుకు ఉపకరించాలనే సదుద్ధేశంతో కరిష్మాతో ఇద్దరి పిల్లల కోసం రూ. 14 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశాడు. దానికి రూ. 10 లక్షల వడ్డీ అందుతోంది.
సంజయ్ కి ముగ్గురు పిల్లలు. కరిష్మాతో అతని ఇద్దరు పిల్లలు - సమైరా , కియాన్ లకు 20 ఏళ్లు, 14 సంవత్సరాలు, వారు కంపెనీలో భాగం కాదు. సంజయ్ చిన్న కుమారుడు అజారియాస్ (అతని మూడవ భార్య ప్రియా సచ్దేవ్తో) కేవలం 6 సంవత్సరాలు. వారిలో ఎవరూ ప్రస్తుతానికి కంపెనీ పగ్గాలు చేపట్టే అవకాశం లేదు. సంజయ్ కి చెందిన సోనా కామ్స్టార్ వ్యవహారాలను ఎవరు నిర్వహిస్తారనే దానిపై అధికారికంగా క్లారిటీ లేదు. ప్రస్తుత బోర్డు తన అధికారాలను వినియోగించుకున్నా కానీ, సంజయ్ సోదరీమణులు నిర్వహణ పాత్రల్లోకి అడుగుపెట్టవచ్చని ఇండియా.కామ్ వెల్లడించింది.
సంజయ్ కంపెనీలతో నికర ఆస్తి విలువ 1.2 బిలియన్ డాలర్లు (రూ10300 కోట్లు) గా ఉందని ఫోర్బ్స్ గతంలో పేర్కొంది. 2022 , 2024 సంవత్సరాలకు సంజయ్ గరిష్ట సంపద విలువ 1.6 బిలియన్ (రూ.13000 కోట్లు) డాలర్లకు చేరుకుందని ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. చట్టం ప్రకారం.. అతడి ఎస్టేట్ , సంపద నిర్వహణ అతడి భార్య ప్రియా సచ్దేవ్కు వెళుతుంది. అయితే, కరిష్మా కపూర్తో అతడి ఇద్దరు పిల్లలు సమైరా, కియాన్లను కూడా బాగా చూసుకుంటున్నారు. లెగసీ ప్లానింగ్లో భాగంగా, సంజయ్ ఇద్దరికీ రూ.14 కోట్ల విలువైన బాండ్లను బహుమతిగా ఇచ్చాడు. వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల నెలవారీ ఆదాయాన్ని కూడా హామీ ఇచ్చాడని కథనాలొస్తున్నాయి. ఆస్తి కేటాయింపు సమయంలో, కరిష్మాకు సంజయ్ కపూర్ తండ్రి యాజమాన్యంలోని ఇంటి యాజమాన్యం కూడా లభించింది. విడాకుల తర్వాత కరిష్మా -సంజయ్ గౌరవప్రదమైన సంబంధాన్ని కొనసాగించారు. సమైరా (సంజయ్ - కరిష్మా కుమార్తె) 18వ పుట్టినరోజుకు సంజయ్ కపూర్, తన మూడవ భార్య ప్రియా సచ్దేవ్తో కలిసి హాజరై తన X హ్యాండిల్లో ఫోటోలను కూడా షేర్ చేసారు. సంజయ్ 2003లో కరిష్మాను వివాహం చేసుకున్నాడు. ఈ జంట 2005లో కుమార్తె సమైరా, 2011లో కుమారుడు కియాన్కు తల్లిదండ్రులు అయ్యారు.
సంజయ్ కపూర్- కరిష్మా 2003-2016 మధ్య వైవాహిక జీవితాన్ని గడిపారు. అతడు గతంలో 1996-2000 మధ్య ఫ్యాషన్ డిజైనర్ కం స్టైలిస్ట్ నందితా మహతానీతో కాపురం చేసాడు. 2017 నుండి మోడల్ కం నటి ప్రియా సచ్దేవ్ను పెళ్లాడి జీవనం సాగిస్తున్నాడు.
