స్టార్ డమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత
ఈ నేపథ్యంలో సామ్ వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదొడుకులపై మనసు విప్పి మాట్లాడారు.
By: Srikanth Kontham | 16 Jun 2026 4:00 PM ISTస్టార్ హీరోయిన్ సమంత చిత్ర పరిశ్రమలో ఎలా ఎదిగిందన్నది చెప్పాల్సిన పనిలేదు. కమర్శియల్ చిత్రాలతో పాటు వైవిథ్యమైన పాత్రలను ఎంచుకుని నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కిచకుంది. అయితే ఆమె జీవితంలో ప్రేక్షకులకు తెలిసిన ఒడిదుడులకు కొన్ని మాత్రమే. నాగచైతన్యతో వివాహా బంధం వీగిపోవడం.. మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడటం మినహా ఇంకేవి పెద్దగా తెలియవు. ఈ నేపథ్యంలో సామ్ వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదొడుకులపై మనసు విప్పి మాట్లాడారు. మైయోసిటిస్ వ్యాధి బారిన పడటానికి ముందు స్టార్డమ్ వెనుక పరిగెత్తిన విధానాన్ని.. ఆ సమయంలో తనలో పెరిగిన అహాన్ని అమ్మడు నిజాయితీగా అంగీకరించారు.
చిన్న పట్టణం నుండి వచ్చి ఊహించని స్థాయిలో స్టార్డమ్ అందుకోవడం వల్ల తన ఆలోచనలు ఏ విధంగా మారాయి అన్న దానిపై తొలిసారి పెదవి విప్పింది. సినిమా పరిశ్రమలోకి వచ్చిన తొలి నాళ్లలో లభించిన విపరీతమైన ప్రజాదరణ తనను ఒక రకమైన భ్రమలో నెట్టేసిందని తెలిపింది. ప్రేక్షకులు తన పేరును బిగ్ స్క్రీన్పై చూసి కేకలు వేయడం, తన సినిమాల కోసం ఎదురుచూడటం చూసి, తాను స్టార్డమ్ అనే ఆటకు దాసురాలినయ్యాననంది. నిరంతరం రేసులో ముందుండాలనే తపనతో ఒకరిని మించి మరొకరు విజయం సాధించాలనే పోటీ వాతావరణం అనేది ఒక భ్రమ మాత్రమేనని.. ఆ రేసుకు ఎప్పటికీ ముగింపు రేఖ ఉండదని ఆలస్యంగా గ్రహించానంది.
కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకే సంవత్సరంలో వరుసగా ఐదు చిత్రాల్లో నటించానని.. అవన్నీ భారీ విజయాలు సాధించడంతో పరిశ్రమలో తనను గోల్డెన్ లెగ్ అని పిలిచారని సమంత గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ప్రజల అంచనాలకు తగ్గట్టుగా నిలబడాలనే ఒత్తిడితో, కథల ఎంపికలో క్రియేటివ్ గ్రోత్ కంటే బాక్సాఫీస్ విజయాలకే ప్రాధాన్యత ఇచ్చానన్నారు. ఆ క్రమంలో గర్వించలేని కొన్ని చిత్రాలు కూడా చేయాల్సి వచ్చిందంది. బ్లాక్బస్టర్ హిట్ అనే గర్వంతో ఆ రోజుల్లో సరిపెట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే 2022లో మైయోసిటిస్ నిర్ధారణ కావడం సమంత జీవితంలోనే అతిపెద్ద మలుపుగా మారింది.
ఆ సమయంలో సామ్ కెరీర్లో అత్యంత బిజీగా ఉంటూ మరిన్ని సినిమాలు చేయాలనే కసితో ఉంది. నటీనటులుగా ఉన్నప్పుడు విజయం కళ్లు గప్పి.. తమ ప్రయాణానికి అసలు ముగింపే ఉండదనేంత అహంకారం తలకె క్కుతుందని.. కానీ అనారోగ్యం వల్ల వచ్చిన విరామం .. కెరీర్ శాశ్వతం కాదనే నిజాన్ని ..ముగింపును స్పష్టంగా చూసేలా చేసిందంది.ఈ విరామం సమంతను పూర్తిగా మార్చేసిందంది. కోలుకున్న తర్వాత పరిశ్రమలోకి తిరిగి వచ్చేటప్పుడు తన పాత అలవాట్లను, పని చేసే శైలిని పూర్తిగా మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నానంది.
అందుకనుగుణంగానే బ్రాండ్ ఎండార్స్మెంట్లు, సినిమాల ఎంపిక విషయంలో 360 డిగ్రీల మార్పును తీసుకొచ్చానంది. కేవలం నటిగానే కాకుండా సొంతంగా ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి మనసుకు నచ్చిన రీతిలో జీవితాన్ని గడుపుతున్నానని... ఇప్పుడు తాను ఏ రేసులోనూ లేనని సామ్ సంతోషంగా ప్రకటించింది.
ప్రస్తుతం సమంత నటిస్తూ నిర్మిస్తున్న `మా ఇంటి బంగారం` అనే ఫ్యామిలీ యాక్షన్ డ్రామా చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జూన్ 19న విడుదల కానుంది.
