లెజెండరీ బయెపిక్లో సాయి పల్లవి!
బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న `రామయణ`లో సాయి పల్లవి సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Entertainment Desk | 10 Feb 2026 6:17 PM ISTఅమరణ్, తండేల్ చిత్రాల తరువాత క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి సెలెక్షన్ చాలా హైలోకి వెళ్లిపోతోంది. వరుసగా రెండు బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకున్న సాయి పల్లవి ఇప్పుడు అంతకే మించిన స్థాయి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న `రామయణ`లో సాయి పల్లవి సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. యావత్ భారతం అమూల్యంగా భావించే రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది.
ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుని ఈ ఏడాది దీపావళికి భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. వచ్చే ఏడాది దీపావళికి రెండవ భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు ఆమీర్ఖాన్ తనయుడు జునైద్ ఖాన్తో కలిసి `ఏక్ దిన్`లో నటిస్తోంది. ఇది మే 1న రిలీజ్ కాబోతోంది. ధనుష్ 55వ ప్రాజెక్ట్ని రీసెంట్గా ఓకే చేసిన సాయి పల్లవి తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. లెజెండరీ సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ లో నటించబోతోంది. భారతీయ శాస్త్రీయ సంగీతానికి వన్నె తెచ్చిన కర్ణాటక సంగత విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బలక్ష్మి.
భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కారణిగా ఆమె ప్రత్యేకత చాటుకున్నారు. ఆసియా నోబెల్గా భావించే రామన్ మెగసేసే పురస్కారాన్ని సైతం సొంతం చేసుకున్నారు. రచయిత, జర్నలిస్ట్, స్వాంతంత్య్ర సమరయోధుడు త్యాగరాజన్ సదాశివంను ప్రేమ వివాహం చేసుకున్నారు. పదేళ్ల ప్రాయంలోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న సుబ్బలక్ష్మి చదువుని పక్కన పెట్టి సంగీత ప్రపంచానికే పరిమితమయ్యారు.
ఈ భారీ ప్రాజెక్ట్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ని మొదలు పెట్టేశారు. మూవీ ఆఫీస్ని అల్లు అర్జున్ ఆఫీస్ సమీపంలో తీసుకున్నారట. గౌతమ్ తిన్ననూరి దీనికి దర్శకుడు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన వర్క్ ప్రస్తుతం హైదరాబాద్లో రాకెట్ స్పీడుతో జరుగుతున్నట్టుగా తెలిసింది. శాస్త్రీయ సంగీత నేపథ్యంతో గ్లోబల్ ఐకాన్గా ఎదిగిన ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత కథ ఎందరికో ఆదర్శం. 2013లో ప్రముఖ కెమెరామెన్ రాజీవ్ మీనన్ ఈ బయోపిక్ని తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేశాడు.
ఎం.ఎస్. సుబ్బలక్ష్మిగా విద్యాబాలన్ని తీసుకోవాలనుకున్నాడు. విద్యాబాలన్కు స్టోరీ కూడా వినిపించాడు. తను కూడా ఓకే చెప్పేసింది. కానీ అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత నయనతార, రష్మిక మందన్న, త్రిషల పేర్లు కూడా వినిపించాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఎం.ఎస్.సుబ్బలక్ష్మి బయోపిక్ని ప్లాన్ చేసిన మేకర్స్ ఫైనల్గా
సాయి పల్లవిని ఎంపిక చేశారు. ఈ సినిమాలో ఎం.ఎస్. సుబ్బలక్ష్మీ జర్నీని చూపించబోతున్నారు. ఆమె ఎర్లీ లైఫ్, సదాశివంని పెళ్లి చేసుకున్న సందర్భం, గాయనిగా ఎదిగిన క్రమం, నటిగా చేసిన చిత్రాలు వంటి విషయాలు ఇందులో చూపించనున్నారని తెలిసింది.
