ఏఐ స్విమ్సూట్.. ఐశ్వర్యారాయ్ బాటలో సాయిపల్లవి?
కానీ ఇప్పుడు టెక్నాలజీ అన్ని సరిహద్దులను దాటుతోంది. సాయిపల్లవి స్విమ్ సూట్ ఫోటోల కోసం ఏఐ (కృత్రిమ మేధస్సు)ను ఉపయోగించడం ఇటీవల చర్చగా మారింది.
By: Sivaji Kontham | 29 Sept 2025 1:08 AM ISTనటిగా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి సాయిపల్లవి విధి విధానాల గురించి అభిమానులకు స్పష్ఠంగా తెలుసు. ఈ ప్రతిభావని తన నటన, డ్యాన్సింగ్ ఎబిలిటీని నమ్ముకుని మాత్రమే పరిశ్రమలో ముందుకు సాగుతోంది. చాలా మంది సోషల్ మీడియా ఫోటోషూట్ల పేరుతో విచ్చలవిడితనంతో చెలరేగిపోతుంటే సాయిపల్లవి మాత్రం ఏనాడూ హద్దు దాటలేదు. అనవసర ఎక్స్ పోజింగులు, కవ్వించే టీజ్ చేసే ఫోటోషూట్లతో రెచ్చిపోలేదు.
కానీ ఇప్పుడు టెక్నాలజీ అన్ని సరిహద్దులను దాటుతోంది. సాయిపల్లవి స్విమ్ సూట్ ఫోటోల కోసం ఏఐ (కృత్రిమ మేధస్సు)ను ఉపయోగించడం ఇటీవల చర్చగా మారింది. రెండు వారాలుగా సాయిపల్లవి స్విమ్ సూట్ ఫోటోలు ఇంటర్నెట్ లో దుమారం రేపుతున్నాయి. ఈ ఫోటోలు ఫేక్ కాకపోయి ఉంటే సాయిపల్లవి ఛాయిస్ను గౌరవిస్తామని కొందరు అభిమానులు వ్యాఖ్యానిస్తే... ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి ప్రాధాన్యతనిచ్చే నటిని తప్పుదారి పట్టిస్తూ అగౌరవపరిచే ఫోటోషూట్ ఇది అని ఒక సెక్షన్ తీవ్రంగా విమర్శిస్తోంది.
మరోవైపు సాయి పల్లవి లేటెస్ట్ బీచ్ విహార యాత్రకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలలో వైరల్ గా మారాయి. ఇటీవల ఒక పర్యటనలో తీసిన ఫోటోలను షేర్ చేయగా అవన్నీ ప్రకృతి సౌందర్యంతో సహజసిద్ధంగా ఉన్నాయి. నిజ జీవితానికి, కృత్రిమ కల్పనకు మధ్య ఉన్న తేడాను ఈ ఫోటోలు స్పష్ఠంగా చూపిస్తున్నాయి. డిజిటల్ యుగంలో ఏదైనా విషయాన్ని నమ్మే ముందు క్రాస్ చెక్ చేసుకోవాలని సాయిపల్లవి ఈ సందర్భంగా అభ్యర్థించారు.
కోర్టులో అనుకూల తీర్పు:
ఏఐ - డిజిటల్ సాంకేతికత ప్రభావంతో చాలా మంది స్టార్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల దిల్లీ హైకోర్టులో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ జోడీ పోరాడిన తీరు ఆశ్చర్యపరిచింది. వారి వ్యక్తిగత ఐడిలు, ఫోటోలను ఉపయోగించుకుని అనవసర తప్పుడు ప్రకటనలు రూపొందిస్తున్నారని ఐశ్వర్యారాయ్ కోర్టులో వాదించి చివరికి అనుకున్నది సాధించారు. ఐష్ భర్త అభిషేక్ కూడా కోర్టులో తన వాదన వినిపించారు. అనంతరం కింగ్ నాగార్జున కూడా కొన్ని వెబ్ సైట్లలో అనధికారిక పోస్టింగులపై దిల్లీ కోర్టుకు వెళ్లారని కథనాలొచ్చాయి. ఇప్పుడు సాయిపల్లవి కూడా అలాంటి ప్రయత్నం చేస్తారా? తన అనుమతి లేకుండా దుర్వినియోగం చేసే తన ఫోటోలు, వీడియోలు, ఐడెంటిటీ ల విషయంలో కోర్టునాశ్రయిస్తారా? అన్న చర్చా సాగుతోంది.
