మనల్ని మనం మర్చిపోయి పాత్రల్లోకి వెళతాం: సాయిమాధవ్ బుర్రా
''కేవలం హాస్యం మాత్రమే ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు.. నవరసాలు ఉంటేనే ఎంటర్టైన్మెంట్.. అలాంటి వినోదం ఈ సినిమాలో కుదిరిందని'' అన్నారు సాయిమాధవ్ బుర్రా.
By: Sivaji Kontham | 16 Feb 2026 7:00 AM IST''కేవలం హాస్యం మాత్రమే ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు.. నవరసాలు ఉంటేనే ఎంటర్టైన్మెంట్.. అలాంటి వినోదం ఈ సినిమాలో కుదిరిందని'' అన్నారు సాయిమాధవ్ బుర్రా. 'సీతాపయనం' థాంక్స్ మీట్లో ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది.
సాయిమాధవ్ మాట్లాడుతూ-''ఒక మంచి సినిమాకి మాటలు రాసే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో మనం కూడా ఒక పాత్రధారి అనుకునేలా ఉంటుంది. పాత్రల్లో మనల్ని మనం వెతుక్కుంటాం. థాంక్యూ అనే మాట లవ్ యూ అనే మాట కంటే గొప్పది అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు.. థాంక్యూ అనే మాట జీవితాన్ని మార్చేసిందని అర్థమవుతుంది. డైలాగులు రాసే అవకాశం ఇచ్చిన అర్జున్ కి ధన్యవాదాలు. సన్నివేశంలో డెప్త్ నాకు మాటలు రాసే స్కోప్ పెంచింది. సినిమాలో ఏ పాత్రా.. ఏ సీన్ వృథా కాదు. అన్ని రసాలు ఉన్న సినిమా కాబట్టి థియేటర్లలో జనం చూస్తున్నారు. మా తెనాలిలోను సినిమాను బాగా చస్తున్నారు. ఇలాంటి సినిమా కదా రావాలి.
వినోదం ఒక్కటే ఎంటర్ టైన్ మెంట్ కాదు.. మనల్ని మనం మర్చిపోయి.. సినిమాలో పాత్రల్లోకి వెళ్లిపోతాం. ఆ కష్టాలు కన్నీళ్లు లేదా నవ్వుల్లో మనల్ని మనం చూసుకుంటాం. కేవలం వినోదం మాత్రమే ఎంటర్ టైన్ మెంట్ అనుకుంటారు.. నవరసాలు ఉండేది ఎంటర్ టైన్ మెంట్. ఈ సినిమా చూస్తున్నంత సేపూ.. మనల్ని మనం మర్చిపోతాం. ఆ కథలోకి వెళతాం.. ఆ పాత్రలోకి వెళతాం..అని అన్నారు. ఈ సినిమాకి పని చేసిన సాంకేతిక నిపుణులు అద్భుతమైన పనితో ఆకట్టుకున్నారు. దర్శకత్వం, సంగీతం గురించి చెప్పాల్సిన పని లేదు. అవకాశ మిచ్చిన అర్జున్ గారికి, సాంకేతిక నిపుణులు, ఇతర క్రియేటర్లకు థాంక్యూ'' అని అన్నారు.
అర్జున్ గారు కేవలం ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు.. అంతకు మించి ఆయనకు సినిమాపై ఉన్న ప్యాషన్ విజన్ తనను ఎంతో ఆకట్టుకున్నాయని సాయిమాధవ్ గత ఇంటర్వ్యూలో చెప్పారు. సీతాపయనం అనేది కేవలం ఒక ప్రయాణం కాదు.. ఇది ఒక తండ్రి తన కూతురికి ఇచ్చిన అపురూపమైన కానుక.. ఈ సినిమాలో నటించిన ఐశ్వర్య అర్జున్, నిరంజన్ కి మంచి పేరొచ్చింది. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం సినిమాలోని ఎమోషన్స్ను మరింత ఎలివేట్ చేసిందని ప్రశంసలు కురుస్తున్నాయి.
