సాయి అభ్యంకర్ ప్లాన్ ఇప్పటికైనా అర్థమైందా?
సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన యువ సంగీత దర్శకుల్లో సాయి అభ్యంకర్ పేరు టాప్ లో ఉంటుందేమో.
By: M Prashanth | 22 May 2026 2:00 PM ISTసోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన యువ సంగీత దర్శకుల్లో సాయి అభ్యంకర్ పేరు టాప్ లో ఉంటుందేమో. చిన్న వయసులోనే తన స్పెషల్ మ్యూజిక్ స్టైల్ తో సౌత్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఆ యంగ్ కంపోజర్ ఇప్పుడు వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా మారారు. అయితే ఆయనపై వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. సాయి అభ్యంకర్ పని చేసే విధానం, ఆయన ప్లాన్ ఇప్పుడిప్పుడే చాలా మందికి అర్థమవుతోందనే చర్చ మొదలైంది.
ప్రైవేట్ ఆల్బమ్స్, ఇండిపెండెంట్ మ్యూజిక్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సాయి అభ్యంకర్ మొదటగా మలయాళ చిత్రం బాల్టీతో సంగీత దర్శకుడిగా సినీ ప్రయాణం ప్రారంభించారు. కానీ అతనికి అసలు బ్రేక్ ఇచ్చింది డ్యూడ్ మూవీ. ఆ సినిమాలోని పాటలు యూత్ ను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఒక్కసారిగా సాయి పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముఖ్యంగా ఆయన మ్యూజిక్ లో ఉండే కొత్త తరహా బీట్స్, మెలోడీతో పాటు ఎమోషనల్ టచ్ యువతను బాగా కనెక్ట్ చేసింది.
డ్యూడ్ సక్సెస్ తర్వాత సాయి అభ్యంకర్ కు వరుస అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరో సూర్య నటించిన కరుప్పు సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ దక్కించుకున్నారు. అంతేకాదు, లోకేష్ కనగరాజ్ నిర్మాణంలో లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న బెంజ్, కార్తి నటిస్తున్న పీరియాడిక్ చిత్రం మార్షల్, అలాగే అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ లో రూపొందతున్న రాకా వంటి క్రేజీ ప్రాజెక్టులు కూడా ఆయన ఖాతాలో చేరాయి. ఒక యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కు ఇంత తక్కువ సమయంలో ఇలాంటి లైన్ అప్ రావడం ఆసక్తికరంగా మారింది.
అయితే ఇటీవల కరుప్పు సినిమా విడుదలైన తర్వాత సాయి అభ్యంకర్ మ్యూజిక్పై కొంత విమర్శలు కూడా వినిపించాయి. ముఖ్యంగా ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ మొదటిసారి వినగానే పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదని కొందరు కామెంట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఇంత పెద్ద ప్రాజెక్టులకు సాయి సరిపోతారా? అన్న చర్చ కూడా జరిగింది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటిస్తున్న రాకాపై అభిమానుల్లో కొంత ఆందోళన కనిపించింది.
కానీ ఆసక్తికర విషయం ఏమిటంటే.. మొదట విమర్శలు వచ్చిన అదే కరుప్పు మ్యూజిక్ ఇప్పుడు నెమ్మదిగా ప్రేక్షకుల్లోకి వెళ్లి ప్రశంసలు అందుకుంటోంది. సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. చాలా మంది ప్రేక్షకులు మొదట అర్థం కాలేదని, కానీ ఇప్పుడు బాగా కనెక్ట్ అవుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదే ఇప్పుడు సాయి అభ్యంకర్ మ్యూజిక్ స్టైల్ పై కొత్త చర్చకు దారితీసింది. సాధారణంగా కొంతమంది సంగీత దర్శకుల పాటలు మొదటి వినికిడికే ఆకట్టుకుంటాయి. కానీ సాయి మాత్రం మెల్లగా వినే వారిని తన మ్యూజిక్ వరల్డ్ లోకి లాగుతున్నారని అభిమానులు చెబుతున్నారు. ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేయడం కంటే.. తన సంగీతాన్ని ప్రేక్షకులకు మెల్లగా అలవాటు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
