గదిలో ఉరి వేసుకుని కనిపించిన నటుడు
సచిన్ గణేష్ వృత్తిగతంగా ఇంజినీర్.. పూణేలోని ఓ ప్రయివేట్ సంస్థలో పని చేస్తున్నాడు. దీపావళి వేడుకల కోసం అతను తన స్వస్థలమైన పరోలా తహసీల్లోని ఉందిర్ఖేడేకు వచ్చాడు.
By: Sivaji Kontham | 27 Oct 2025 11:30 PM ISTవెబ్ సిరీస్ లు చాలా మంది ప్రతిభావంతులను ప్రజలకు పరిచయం చేస్తున్నాయి. అలా పరిచయమైనవాడే సచిన్ గణేష్ చంద్ వాడే. `జమ్ తారా 2` సిరీస్లో అద్భుత నటనకు గాను ఈ యువనటుడికి దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. మరాఠాలో పలు వెబ్ సిరీస్ లలో నటించిన సచిన్ వేగంగా నటుడిగా ఎదిగేస్తున్నాడు. తదుపరి బాలీవుడ్ లో పెద్ద కెరీర్ ని ఆశించాడు.
కానీ ఇంతలోనే విధి ఆడిన వింత నాటకంలో అతడు ఇహలోకం వీడి అంతర్ధానమయ్యాడు. సచిన్ గణేష్ చంద్వాడే అక్టోబర్ 23న భాయ్ దూజ్లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. నెట్ ఫ్లిక్స్ మరాఠా వెబ్ సిరీస్ `అసుర్వాన్`.. `విశయ్ క్లోజ్` అనే సినిమా షూటింగ్ లను ఇటీవలే పూర్తి చేశాడు. ఇవి రెండూ త్వరలో విడుదల కానున్నాయి.
సచిన్ గణేష్ వృత్తిగతంగా ఇంజినీర్.. పూణేలోని ఓ ప్రయివేట్ సంస్థలో పని చేస్తున్నాడు. దీపావళి వేడుకల కోసం అతను తన స్వస్థలమైన పరోలా తహసీల్లోని ఉందిర్ఖేడేకు వచ్చాడు. భాయ్ దూజ్ రోజున అతడు తన గదిలో ఉరివేసుకుని కనిపించాడు. ఈ ఘటనకు షాకైన కుటుంబీకులు అతడిని వెంటనే పరోలాలోని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తరువాత వైద్యులు సచిన్ ను ధూలేకు తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. అయితే, అతను ధూలేలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోస్ట్మార్టం తర్వాత అతడి కుటుంబం వారి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించింది.
ప్రస్తుతం సచిన్ ఆకస్మిక మరణం వెనక మిస్టరీని ఛేధించేందుకు పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. యువనటుడు సచిన్ చనిపోవడానికి వారం ముందు `అసుర్వాన్`పై చాలా ఉత్సాహం వ్యక్తం చేస్తూ ఇన్ స్టాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం స్నేహితులు సచిన్ ఆకస్మిక మరణం గురించి తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. కుటుంబానికి అండగా నిలిచారు.
