Begin typing your search above and press return to search.

శబ్దం టీజర్.. సౌండ్ తోనే భయపెడుతున్నారుగా..

సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌ గానే మరో థ్రిల్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

By:  Tupaki Desk   |   12 April 2024 12:46 PM GMT
శబ్దం టీజర్.. సౌండ్ తోనే భయపెడుతున్నారుగా..
X

2009లో వచ్చిన వైశాలి సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అది పినిశెట్టి హీరోగా అరివళగన్ దర్శకత్వంలో వచ్చిన ఆ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఇన్నాళ్ళకు మళ్ళీ వారి కాంబినేషన్‌లో శబ్దం అనే సినిమా రాబోతోంది. సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌ గానే మరో థ్రిల్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

7G ఫిల్మ్స్ శివ మరియు ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్ బానుప్రియ శివ సహ నిర్మాతగా ఉన్నారు. గతంలో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన మేకర్స్ ఈరోజు టీజర్‌ను లాంచ్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ టీజర్ లాంచ్ చేశారు. టీజర్‌తో సినిమాలోని అదిరిపోయే సెటప్‌ తో ఆసక్తిని కలిగించింది.

ఆది పినిశెట్టి ఒక హాంటెడ్ హౌస్ వద్ద కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగేటప్పుడు కొన్ని విచిత్రమైన శబ్దాలను రికార్డ్ చేయడం కనిపిస్తుంది. ఇక అసలు విషయాలను రివీల్ చేయకుండా, టీజర్‌లో సినిమాలోని ప్రముఖ నటీనటులందరినీ చూపించారు. ఆది పినిశెట్టి తన పాత్రలో కొత్తగా కనిపిస్తున్నాడు, దర్శకుడు అరివళగన్ ఈసారి సౌండ్ తో ఆత్మలకు సంబంధించిన పాయింట్ ను విభిన్నంగా తెరపైకి తీసుకు రానున్నట్లు తెలుస్తోంది.

అరుణ్ బత్మనాభన్ కెమెరా యాంగిల్స్ ప్రతి బ్లాక్‌లో భయానకతను సృష్టిస్తాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సంగీత దర్శకుడు థమన్ తన పని తనాన్ని చూపించాడు. ఇలాంటి హర్రర్ థ్రిల్లర్‌లలో మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక థమన్ కు ఇదొక మంచి ఛాలెంజింగ్ మూవీ అని చెప్పవచ్చు. వైశాలిలో ఎక్కువగా వర్షం ఆత్మ కనెక్షన్ సన్నివేశాలు ఉండగా, శబ్దం సినిమాలో వాయిస్ తో ఆత్మల కనెక్షన్ ఉన్నట్లు అనిపిస్తుంది.

చాలా సన్నివేశాలు పర్వతాలు మరియు పర్యాటక ప్రదేశాలలో కనిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో సౌండ్‌కి సంబంధించి ప్రత్యేక సన్నివేశాలు ఉండనున్నాయి. ముంబై, మున్నార్ మరియు చెన్నైలోని అనేక ప్రదేశాలలో ఈ సినిమా చిత్రీకరించబడింది. సినిమా కోసం 120 ఏళ్ల నాటి లైబ్రరీని నిర్మించారు. ఈ సినిమాలో సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లీ, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సాబు జోసెఫ్ ఎడిటర్ కాగా.. మనోజ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.