ఆ జానర్ పై ఫోకస్ చేస్తున్న దర్శకనిర్మాతలు
ఆ తర్వాత రీరిలీజులు. ముందు హిట్ సినిమాలతో మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత ఓ మోస్తరు, ఫ్లాపు సినిమాలను కూడా రీరిలీజ్ చేసి వాటిని ఎంజాయ్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 16 July 2025 5:00 PM ISTసినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదొక ట్రెండ్ నడుస్తూనే ఉంటుంది. ఎవరైనా ఒక విషయంలో కొత్తగా ట్రై చేస్తే మిగిలిన వాళ్లు కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటుంటారనే సంగతి తెలిసిందే. అలా ఇప్పటికే చాలా ట్రెండ్స్ వచ్చాయి. టాలీవుడ్ లో అది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. బాహుబలి సినిమాను చూసి అందరూ తమ సినిమాలను కంటెంట్ తో పని లేకుండా రెండు భాగాలుగా రిలీజ్ చేయడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాతే సీక్వెల్స్ ట్రెండ్ టాలీవుడ్ లో ఎక్కువైంది. ఇప్పటికీ ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది.
ఆ తర్వాత రీరిలీజులు. ముందు హిట్ సినిమాలతో మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత ఓ మోస్తరు, ఫ్లాపు సినిమాలను కూడా రీరిలీజ్ చేసి వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త సినిమాలకే కలెక్షన్స్ ఎలా రాబట్టుకోవాలా అని దర్శకనిర్మాతలు నానా తంటాలు పడుతుంటే రీరిలీజ్లు మాత్రం మంచి కలెక్షన్లు తెచ్చుకుంటున్నాయి. ఇక అసలు విషయానికొస్తే టాలీవుడ్ లో ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ మొదలైంది.
అదే రూరల్ డ్రామాలు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలపై దర్శకనిర్మాతలు ఈ మధ్య ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలు సినిమాలు రాగా మరికొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేసి తమ లక్ ను టెస్ట్ చేసుకోవాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి చేసిన శుభం సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కింది. కొత్త వాళ్లతో రూపొందిన ఈ సినిమా తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కింది. సమంత నిర్మించిన సినిమా కావడంతో శుభంకు ప్రమోషన్స్ ప్లస్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద కూడా శుభంకు మంచి కలెక్షన్లే రావడంతో నిర్మాతగా సమంత గట్టెక్కారు. దీంతో ఇప్పుడు సమంత ఇలాంటి తరహా సినిమాలపైనే కన్నేసినట్టు తెలుస్తోంది.
కీర్తి సురేష్ ఇప్పటికే ఉప్పు కప్పురంబు అనే సినిమాతో రూరల్ డ్రామా చేసినప్పటికీ అది ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అయితే ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ రిలీజైంది. ఇక హీరో రానా కొత్త టాలెంట్ ను, రూరల్ సినిమాలను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. కేరాఫ్ కంచరపాలెం, పరేషాన్ లాంటి పలు సినిమాలను ఎంకరేజ్ చేసి రిలీజ్ చేసిన రానా, ఇప్పుడు కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాను సమర్పిస్తున్నారు. ఆ సినిమాల్లానే ఈ మూవీని కూడా బ్లాక్ బస్టర్ చేయాలని చూస్తున్నారు రానా. ఇప్పటికే రిలీజైన కొత్తపల్లిలో ఒకప్పుడు ట్రైలర్ ఆడియన్స్ లో మంచి ఆసక్తిని కలిగించింది. జులై 18న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా తిమ్మరాజు పాలెం టీవీ అనే సినిమాతో మొత్తం కొత్త టీమ్ తో ఓ రూరల్ డ్రామా చేస్తున్నారు. వీటన్నింటి కంటే అతి పెద్ద ప్రాజెక్టు రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా కూడా రూరల్ డ్రామాగానే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు హిట్టైతే టాలీవుడ్ లో ఈ బ్యాక్డ్రాప్ లో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశముంది.
