Begin typing your search above and press return to search.

రూటు మార్చనున్న ప్రముఖ దర్శకుడు?

బాలీవుడ్‌ గత నాలుగు.. ఐదు సంవత్సరాలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   2 Jun 2025 8:00 PM IST
రూటు మార్చనున్న ప్రముఖ దర్శకుడు?
X

బాలీవుడ్‌ గత నాలుగు.. ఐదు సంవత్సరాలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఈ సమయంలో కూడా కొన్ని సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఒక మోస్తరుగా నిలిచాయి. కమర్షియల్‌ సినిమాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పటి వరకు యాక్షన్‌, కామెడీ సినిమాలను చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈయన నుంచి మరో బిగ్‌ సినిమా రాబోతుంది. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో సినిమా అనగానే అంతా కూడా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ అని అనుకుంటారు. కానీ అందరి అంచనాలకు విభిన్నంగా, విరుద్దంగా హర్రర్‌ జోనర్‌ సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది.

బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లోనూ ఈ మధ్య కాలంలో హర్రర్‌ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో వచ్చిన స్త్రీ 2 తో పాటు భూల్‌ బులయ్యా సినిమాలు ఏ స్థాయిలో వసూళ్లు సాధించాయో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ తీవ్రమైన ఒడిదొడుకుల్లో ఉన్న సమయంలో వచ్చిన ఈ హర్రర్‌ కామెడీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు రాబట్టాయి. దాంతో బాలీవుడ్‌లోని పలువురు దర్శకులు ఇప్పుడు హర్రర్‌ సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హర్రర్‌ కామెడీ జోనర్‌లో చాలా కాలం నుంచి సినిమాలు వస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వాటి శాతం ఎక్కువ కావడంతో పాటు, సక్సెస్‌ రేటు ఎక్కువగా ఉంది.

హర్రర్‌ కామెడీ సినిమాలకు ఉన్న ఆధరణ నేపథ్యంలో ప్రముఖ దర్శకులు సైతం ఈ జోనర్‌కి షిప్ట్‌ అయ్యేందుకు రెడీ అయ్యారు. అందులో రోహిత్‌ శెట్టి ఒకరు అని తెలుస్తోంది. ఈమధ్య కాలంలో ఆయన ఒక హర్రర్‌ కామెడీ సినిమా కథను రెడీ చేశారని, తన సన్నిహిత రచయితతో కలిసి రెడీ చేసిన ఆ కథకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందని తెలుస్తోంది. ప్రముఖ హీరోతో ఈ సినిమాను చేసేందుకు గాను ఆయన ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. హర్రర్‌ కామెడీ సినిమాకు బడ్జెట్‌ తక్కువ ఖర్చు అవుతుంది. కనుక రోహిత్‌ శెట్టి ఈ కొత్త రూటును ఎంపిక చేసుకుని ఉంటారు అనేది టాక్‌. సాధారణంగానే ఆయన సినిమాల బడ్జెట్‌ శృతి మించవు అనే టాక్‌ ఉంది.

అలాంటి రోహిత్‌ శెట్టి హర్రర్‌ థ్రిల్లర్‌ కామెడీ జోనర్‌లో సినిమాను చేస్తే కచ్చితంగా అభిమానులతో పాటు అన్ని వర్గా వారు ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. పైగా తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ లాభాలను సొంతం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేసే విధంగా కామెడీ ఎలిమెంట్స్‌తో హర్రర్ సినిమాను రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయం గురించి ఆయన నుంచి లేదా ఆయన సన్నిహితుల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తల్లో నిజం లేదని కొందరు అంటూ ఉంటే, కొందరు మాత్రం రోహిత్‌ శెట్టి నుంచి నిజంగా అలాంటి ఒక సినిమా వస్తే కచ్చితంగా మాస్ ఆడియన్స్‌కి పండుగే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.