దర్శకుడిగా రెండవ ప్రయత్నం పెద్ద బాద్యతే!
నటుడుగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రితీష్ దేశ్ముఖ్. వేద్ సినిమాతో దర్శకుడి గానూ సక్సెస్ ను అందుకున్నాడు.
By: Srikanth Kontham | 1 April 2026 2:00 PM ISTనటుడుగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రితీష్ దేశ్ముఖ్. వేద్ సినిమాతో దర్శకుడి గానూ సక్సెస్ ను అందుకున్నాడు. అయితే దర్శకుడిగా మాత్రం సీరియస్ గా కొనసాగలేదు. నటనపై ఉన్న ఆసక్తితో దర్శకుడిగా ఆ ఒక్క సినిమా తప్ప మరే సినిమా చేయలేదు. తాజాగా మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రాజా శివాజీ అనే పీరియాడిక్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. దీంతో దర్శ కుడిగా రితీష్ కి రెండవ ప్రయత్నం. రెండవ సినిమాతోనే ఓ భారీ సాహసానికి పూనుకున్నట్లే. ఆయన కెరీర్లోనే అ త్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా నిలుస్తోంది.
ఓ వైపు శివాజీ పాత్రలో నటిస్తూ మరోవైపు దర్శకత్వం వహించడం అంటే షామాషీ కాదు. శివాజీ మహారాజ్ వంటి మహోన్నత వ్యక్తి జీవితాన్ని తెరపై ఆవిష్కరించడం అంటే? భారీ సెట్లు, వందలాది మంది నటీనటులు, యుద్ధ సన్నివేశాల పర్యవేక్షణ వంటివి ఒక దర్శకుడిగా పెద్ద పరీక్షే. తనదైన విజన్తో, చరిత్రకు ఏమాత్రం లోపం లేకుండా ఈ సినిమాను మలచాలని రితీష్ ఎంతో శ్రమిస్తున్నారు. రితీష్ దేశ్ముఖ్ స్వయంగా శివాజీ మహారాజ్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయనతో పాటు సినిమాలో భారీ తారాగణం ఉంది. సంజయ్ దత్ (అఫ్జల్ ఖాన్), అభిషేక్ బచ్చన్ (సంభాజీ షాజీ భోంస్లే), జెనీలియా దేశ్ముఖ్ (సాయిబాయి), విద్యా బాలన్, మహేష్ మంజ్రేకర్, భూమి పెడ్నేకర్ (భాగ్యశ్రీ), ఫర్దీన్ ఖాన్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంతటి భారీ కాస్టింగ్ ను డీల్ చేయడం రితీష్ పట్ల గౌరవాన్ని అంతకంతకు పెంచుతుంది.
టెక్నికల్ అంశాల్లోనూ రితీష్ ఎక్కడా రాజీ పడలేదు. సంగీత దర్శకులు అజయ్-అతుల్ అందించిన నేపథ్య సంగీతం, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సినిమా టోగ్రాఫర్ సంతోష్ శివన్ కెమెరా పనితనం సినిమాకు ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో భారీ హైప్ను క్రియేట్ చేస్తోంది. ఇది కేవలం ఒక మరాఠీ సినిమా మాత్రమే కాదు. పాన్-ఇండియా స్థాయిలో గొప్ప రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారు. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
మరాఠా వీరత్వానికి, స్వరాజ్య స్థాపనకు దర్పణంగా నిలవాలన్న ఉద్దేశంతోనే మే 1న రిలీజ్ వెనుక కారణం. నటుడి నుంచి దర్శకుడిగా ఎదిగిన రితీష్ దేశ్ముఖ్ రెండో ప్రయత్నంలోనే చరిత్ర పుటల్లోకి ఎక్కాలని ఓ మంచి ప్రయత్నం ప్రశంసనీయం. చారిత్రక కథను, బాధ్యతతో తెరకెక్కించడం ద్వారా రితీష్ ఇండియన్ సినిమా రంగంలో ఒక కొత్త బెంచ్మార్క్ను సెట్ చేసే అవకాశం లేకపోలేదు. రాజా శివాజీ విజయవంతమైతే రితీష్ దేశ్ముఖ్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినిమా చరిత్రలో నిలిచిపోతారు.
