Begin typing your search above and press return to search.

మహేష్‌, బన్నీ, విజయ్‌... ఇప్పుడు రవితేజ!

హైదరాబాద్‌ లోని కమర్షియల్‌ ప్రాంతాల్లో ఒకటి అయిన దిల్‌సుఖ్‌ నగర్‌ లో ఏషియన్‌ సినిమాస్ తో కలిసి రవితేజ ఏఆర్‌టీ సినిమాస్‌ అనే మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 April 2024 6:46 AM GMT
మహేష్‌, బన్నీ, విజయ్‌... ఇప్పుడు రవితేజ!
X

టాలీవుడ్‌ హీరోల్లో దాదాపు అంతా కూడా సైడ్‌ ఇన్‌కమ్‌ విషయంలో చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేయడం గగనంగా మారింది. దాంతో ఇతర ఆదాయ మార్గాలు అన్వేషించడం మంచిది అని గత కొన్ని సంవత్సరాలుగా హీరోలు భావిస్తున్నారు.

అందులో భాగంగా కొందరు నిర్మాణ రంగంలోకి వెళ్తే, కొందరు బిజినెస్‌ రంగంలో అడుగు పెడుతున్నారు. కొందరు బ్రాండ్‌ అంబాసిడర్ గా చేస్తున్నారు. ఇక కొందరు ఇండస్ట్రీలోనే ఎగ్జిబిటర్స్ గా అంటే థియేటర్స్ యజమానులుగా లేదా మల్టీ ప్లెక్స్ ల అధిపతులుగా మారుతున్నారు.

మల్టీ ప్లెక్స్ లపై ఆసక్తి ఉన్న హీరోలకు ఏషియన్‌ సినిమాస్ వారు కలుస్తున్నారు. ఇప్పటికే ఏషియన్ వారు మహేష్ బాబుతో ఏఎంబీ ని అల్లు అర్జున్‌ తో ఏఏఏ ను విజయ్‌ దేవరకొండతో కలిసి ఏవీడి మల్టీ ప్లెక్స్‌ లను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈ జాబితాలో రవితేజ మల్టీ ప్లెక్స్ కూడా జాయిన్ అవ్వబోతుంది.

సహాయ దర్శకుడిగా సినీ కెరీర్‌ ను ప్రారంభించిన రవితేజ హీరోగా టాలీవుడ్‌ లో తనకంటూ ప్రత్యేక స్థానంను ఏర్పర్చుకున్నాడు. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రవితేజ ఈ మధ్య కాలంలో నిర్మాణం మొదలు పెట్టాడు. ఇప్పుడు మల్టీప్లెక్స్ బిజినెస్‌ లో అడుగు పెట్టబోతున్నాడు.

హైదరాబాద్‌ లోని కమర్షియల్‌ ప్రాంతాల్లో ఒకటి అయిన దిల్‌సుఖ్‌ నగర్‌ లో ఏషియన్‌ సినిమాస్ తో కలిసి రవితేజ ఏఆర్‌టీ సినిమాస్‌ అనే మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నారు. రవితేజ బ్రాండ్‌ ఇమేజ్ తో ఇప్పటికే అక్కడ ఈ మల్టీప్లెక్స్ గురించి బాగా పబ్లిసిటీ దక్కింది.

ఇటీవలే అక్కడ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఏషియన్‌ సినిమాస్‌ కు చెందిన వారితో పాటు హీరో దగ్గుబాటి అభిరామ్‌ ఇంకా కొందరు పాల్గొన్నారు. ఆరు స్క్రీన్స్ తో నిర్మాణం జరుగుతున్న ఈ మల్టీప్లెక్స్‌ ను అతి త్వరలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు గాను పనులు జరుగుతున్నాయట.